బిల్కిన్ బానో గ్యాంగ్ రేపు కేసులో దోషులకు క్షమాబిక్ష ప్రసాదించి విడుదల చేయడంపై గుజరాత్ సర్కార్ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. 2002 నాటి గోద్రా అనంతర అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో పై అత్యాచార ఘటన కేసులో దోషులు 11 మందిని ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంలో క్షమాబిక్ష ప్రసాదించి విడుదల చేయడంపై ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. గ్యాంగ్ రేప్ కేసులో దోషులను విడుదల చేయడంపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి ఆలీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, మహిళా హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, న్యాయవాది అపర్ణా భట్ వాదనలు వినిపించారు. పిటిషన్ల తరపు వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం.. ఈ కేసు విషయంలో గుజరాత్ ప్రభుత్వ స్పందన తెలియజేయాలంటూ నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
2002 గోద్రా రైలు దహనంకాండ అనంతరం గుజరాత్ లో అల్లర్లు జరిగిన సమయంలో ఈ అత్యాచార ఘటన జరిగింది. బిల్కిన్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో అయిదు నెలల గర్భవతిగా ఉన్న బానోపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ కేసులో 11 మంది నిందితుకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21 న యావజ్జీవ జైలు శిక్ష విధించింది. కాగా దోషులు గా వారు జైలు శిక్ష అనుభవిస్తుండగా, నిందితుల్లో ఒకరు తనను విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అతని విజ్ఞప్తిని పరిశీలించాలని సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వానికి సూచించింది. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయగా, ఆ కమిటీ నిందితులందరికీ క్షమాబిక్ష మంజూరుకు సిఫార్సు చేసింది. ఈ మేరకు వారి విడుదలకు ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడంతో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గోద్రా జైలు నుండి విడుదల చేశారు. దీనిపై బిల్కిన్ బానో, ఆమె భర్త తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వివిధ రాజకీయ పక్షాలు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు.