తమ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏటా సామాజిక సేవా కార్యక్రమాలకు బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్న ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. తాజాగా సామాజిక సేవా కార్యక్రమాలకు 20 బిలియన్ డాలర్లు (సుమారు 1.60లక్షల కోట్లు) విరాళంగా ప్రకటించి తన ఉదారతను చాటుకున్న బిల్ గేట్స్ .. అంతటితో ఆగకుండా తన జీవనానికి, తన కుటుంబ సభ్యుల జీవనానికి కావాల్సింది పోను మిలిగిన యావత్ సంపదను కూడా సమాజానికే ఇచ్చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
మైక్రో సాఫ్ట్ సహా వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ ఫోర్ట్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో అయిదవ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సంపద విలువ 103 బిలియన్ డాలర్లు (రూ.8.13 లక్షల కోట్లు). బిల్ గేట్స్ .. తన మాజీ సతీమణి మిలిందాతో కలిసి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున భారత్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాను ఇస్తున్న ఈ విరాళం త్యాగం కాదనీ, గొప్ప సవాళ్లను ఎదుర్కోవడంలో భాగస్వామ్యం అవుతున్నానని గర్వంగా ఉందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను గొప్పగా ప్రభావితం చేసే స్థాయిలో తన వనరులను సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రపంచంలో గొప్ప సంపద కల్గిన ఇతరులు కూడా ఈ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నానని అన్నారు బిగ్ గేట్స్. ఈ సమాచారాన్ని బిగ్ గేట్స్ తన బ్లాగ్ లో పేర్కొన్నారు.
కాగా తాజాగా ప్రకటించిన 20 బిలియన్ డాలర్ల విరాళాన్ని బిల్ గేట్స్ ఈ నెలలోనే తన ఫౌండేషన్ కు బదలాయించనున్నారు. ప్రస్తుతం ఏటా ఈ ఫౌండేషన్ తరపున ఆరు బిలియన్ డాలర్లకు ఖర్చు చేస్తుండగా, 2026 నాటికి తొమ్మిది బిలియన్ డాలర్లకు తీసుకువెళ్లాలన్నది బిల్ గేట్స్ లక్ష్యం.