Huzurabad Bypoll: హూజూరాబాద్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. ఈటల రాజేందర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. బీజేపీ అధిష్టానం దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని హుజూరాబాద్ తో పాటు మిజోరాంలోని తురివాల్, మహారాష్ట్రలోని చెగలూరు నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకూ బీజేపి అభ్యర్థులను ప్రకటించింది. కేసిఆర్ మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయిన తరువాత ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాత ఈటల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తనకు టీఆర్ఎస్ లో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రజల మద్దతు కోరుతున్నారు.
Huzurabad Bypoll: జమున వ్యాఖ్యలతో తొలుత సంశయం
అయితే ఇటీవల ఈటల సతీమణి జమునరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ అభ్యర్ధిగా రాజేందర్ పోటీ చేస్తారా లేక జమున రెడ్డి పోటీ చేస్తారా అనే సంశయం మెదలైంది. పార్టీ గుర్తు మాత్రం మారదు, బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు తన భర్త రాజేందర్ గానీ తాను గానీ పోటీ చేస్తామని జమునా రెడ్డి పేర్కొన్నారు. అటు టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాలు ఖరారు అయిన నేపథ్యంలో బీజేపీ ఈటల రాజేందర్ పేరును ఖరారు చేసింది. టిఆర్ఎస్ అభ్యర్థిగా విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ ను ఇంతకు ముందే కేసిఆర్ ఎంపిక చేయగా, తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ఎన్ఎస్ యూఐ నేత వెంకట్ బల్మూరు ను ఎంపిక చేసింది.
హూజూరాబాద్ లో త్రిముఖ పోటీ
ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేశారు. ఈటలతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు విస్తృతంగా పర్యటిస్తూ కేసిఆర్ పై,. టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర స్థాయి విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో మంత్రి హరీష్ రావు నేతృత్వంలో టీఆర్ఎస్ నేతలు, మంత్రులు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి టిఆర్ఎస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కాగా ఈ నెల 8వ తేదీ వరకూ నామినేషన్ లను స్వీకరించనున్నారు. ఈ నెల 30వ తేదీ పోలింగ్ జరగనున్నది. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తన నామనేషన్ దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటనతో హుజూరాబాద్ లో త్రిముఖ పోటీ నెలకొంది.