BJP : భారతీయ జనతా పార్టీ అసలు ఉందో లేదో కూడా ఏపీ రాష్ట్ర ప్రజలకి అర్థం కాని సమయం ఇది. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వారికి ఒరిగిందేమీ లేదు. సోము వీర్రాజు ఆరంభంలో వీరంగం చేశారు కానీ తర్వాత చప్పబడిపోయారు. చివరికి పంచాయతీ ఎన్నికల్లో వారు సాధించిన విజయాలను వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. అలాంటి పార్టీ నేతలు 2024 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని బీరాలకు పోతుంటారు.
BJP : అగ్రనాయకత్వమే తొక్కేస్తోంది…?
ఏ పార్టీ అయినా జనాల్లో యాక్టివ్ గా ఉంటే ఏదో ఒక రోజు ప్రజల ఆదరణ దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీకి మాత్రం అసలు ఇటువంటి పరిస్థితి వస్తుందని ఆశ కూడా లేకుండా పోతోంది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే…. పార్టీ జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ విధానాలు అనీ రాష్ట్రంలో వారి ఎదుగుదలను పాతాళంలోకి నెట్టేస్తున్నాయి. తాజాగా చూసుకుంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంలో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో కూడా సోము వీర్రాజు తో పాటు ఏ బిజెపి సభ్యుడికి కూడా క్లారిటీ లేకపోవడం గమనార్హం.
కనీస తోడ్పాటు లేదు…!
బయటకు వస్తున్న నివేదిక ఏమిటి అంటే కేంద్రం ఇప్పుడే విశాఖ ప్రైవేటీకరణ కు కావలసిన ప్రణాళికను మొదలు పెట్టేసింది అని. అయితే వీరు మాత్రం ఎలాంటి సమాధానం చెప్పుకోలేక… ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయలేదని నిర్ణయం తీసుకోలేదని కాకమ్మ కబుర్లు చెప్పారు. ఇక ఈ విషయం పై పార్లమెంట్ లో కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ ప్రకటన చేసిన తర్వాత విశాఖలో ఆందోళనలు మొదలయ్యాయి. ఏదో చేద్దామని మోడీ తో, షా తో మాట్లాడేందుకు వెళ్ళిన వీర్రాజు బృందం ప్రయత్నాలు కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక రాష్ట్రానికి వచ్చిన తర్వాత జనాలకు ఏం చెప్పాలో తోచక ఎదురు దాడులు మొదలుపెట్టారు.
ఏపీ అంటే అన్నింట్లో చిన్న చూపే….
ఉక్కు ప్రైవెటీకరణ విషయం పక్కన పెడితే…. రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం విషయంలో ముప్పుతిప్పలు పెడుతోంది. కాబట్టి రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలకు కేంద్ర ప్రభుత్వం విధానాలు, బీజేపీ అగ్రనాయకత్వం అడ్డుకున్నట్లు స్పష్టంగా కనపడుతుంది. పైగా రేపు జరగబోయే తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో ఆ సీటు కాస్తా జనసేన కే దక్కే అవకాశం ఉందన్నది లోపలి మాట. మరి బిజెపి పార్టీలో ఉన్న నాయకులకు, చేరబోతున్న నాయకులకు భవిష్యత్తు అనేది ఉందా… అంటే అనుమానమే..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?