దక్షిణాది రాజకీయాలపై బీజేపీ ఫోకస్ పెంచింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తొంది. ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండగా, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ బీజేపీ బలోపేతం చేయడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ రాష్ట్రాల్లో మంచి చరిష్మా కల్గిన ప్రముఖులను తమ బుట్టలో వేసుకుంటోంది. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పీటీ ఉష, కర్ణాటకకు చెందిన ప్రముఖుడు వీరేంద్ర హెగ్డే లకు రాజ్యసభ సభ్యులుగా తీసుకుని తమ ఖాతాలో వేసుకుంది బీజేపీ.
రజనీకి గవర్నర్ గిరి.. ?
తాజాగా తమిళనాట బిగ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న ప్రముఖ నటుడు రజనీకాంత్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తొంది. గత ఎన్నికలకు ముందే రాజకీయ పార్టీ అనౌన్స్ చేయాలని భావించిన రజనీకాంత్.. ఆరోగ్య కారణాల రీత్యా ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఇప్పటి వరకూ రజనీకాంత్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేకపోయినా బీజేపీ అగ్రనేతలతో సన్నిహితంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. రజనీ బీజేపీ లో చేరనున్నారంటూ గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ కు గవర్నర్ పదవి ఇవ్వాలని కేంద్రంలోని బీజేపీ నిర్ణయించినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ వార్త తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ఆఫర్ కు రజనీకాంత్ కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తొంది. రజనీకాంత్ ఇటీవల వేస్తున్న అడుగులు కూడా అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. రీసెంట్ గా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్.. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఆ మరుసటి రోజే తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవితో రజనీకాంత్ సమావేశమైయ్యారు.
పార్టీ కండువా కప్పుకోకుండానే..
ఈ పరిణామాలతో రజనీకాంత్ కు గవర్నర్ గిరి ఖాయమనే అంటున్నారు. రజనీకాంత్ తో మోడీకి మంచి స్నేహం ఉంది. గతంలో ప్రధాని మోడీ చెన్నై వచ్చిన సందర్భంలో రజనీ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. బీజేపీ ఆఫర్ చేస్తున్న గవర్నర్ పదవికి అంగీకరిస్తే రజనీకాంత్ అధికారికంగా పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పటికే నలుగురు ప్రముఖులను పెద్ద సభకు పంపి తమ బుట్టలో వేసుకున్న బీజేపీ..గవర్నర్ గిరి ఇచ్చి రజనీకాంత్ ను తమ ఖాతాలో వేసుకోబోతున్నదని అంటున్నారు. రజనీకాంత్ తమ వ్యక్తి అని చెప్పుకోవడం ద్వారా తమిళనాట లక్షలాదిగా ఉన్న ఆయన అభిమానుల మద్దతును కూడగట్టుకోవచ్చు అన్న ప్లాన్ లో బీజేపీ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
చైనాకు భయపడేదే లే అంటూ అత్యంత ఆధునాతన యుద్ద విమానాన్ని ప్రదర్శించిన తైవాన్