దుబ్బాక అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్లు రావడంతో మంచి దూకుడు మీద ఉంది బిజెపి. ప్రస్తుతం ఉన్న ఊపు రాబోయే రోజుల్లో కొనసాగిస్తే ఖచ్చితంగా తెలంగాణాలో అధికారం సాధించడం గ్యారెంటీ అని ఒక అంచనాకు వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి అంశాలకు సంబంధించి ఎక్కడ తగ్గటం లేదు.
ఇదిలా ఉండగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో అక్కడ కూడా సత్తా చాటాలని కమలనాథులు సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. గతంలో జరిగిన ఎన్నికల పరంగా అక్కడ పార్టీ పరిస్థితి చూస్తే 2018 ఎన్నికల సమయంలో కనీసం మూడు వేల ఓట్లు కూడా బిజెపి రాబట్టలేకపోయింది.
అంతకు ముందు జరిగిన ఎన్నికలలో కూడా అదేవిధంగా పార్టీ పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో గత ఎన్నికల ప్రస్తావన జరగబోయే ఎన్నికల ప్రచారంలో తీసుకురాకుండా ముందుకు సాగే విధంగా బిజెపి అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో జరగబోయే ఉప ఎన్నికల టికెట్ విషయంలో కంకణాల నివేదిత రెడ్డి 2014 లో టిడిపి పొత్తు తో పోటీచేసిన కడలి అంజయ్య యాదవులు జరగబోయే ఉప ఎన్నికల టికెట్ ఆశిస్తున్నారు. అంజయ్య యాదవ్ ప్రస్తుతం కమలం పార్టీలో ఉన్నారు. పార్టీ పెద్దల నుండి టికెట్ పై హామీ లభించకపోయినా ఇద్దరూ పోటాపోటీగా నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పార్టీకి చెడ్డపేరు తీసుకు వచ్చే అవకాశం ఉండటంతో ఇద్దరి నేతలతో రాష్ట్ర బీజేపీ పెద్దలు మాట్లాడినట్లు సమాచారం. ఇప్పటికే నాగార్జున సాగర్ లో బిజెపి సర్వేలు చేయించగా ఎవరిని నిలబెట్టిన పార్టీ గెలిచే అవకాశం లేదని తేలిందట. దీంతో ఎప్పటిలాగానే హిందు భావజాల సెంటిమెంట్ తో బిజెపి జరగబోయే ఉప ఎన్నికల్లో ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాలలో టాక్ వస్తోంది.