తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి కి చేరుకున్నట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలలో కనీస పోటీ కూడా ఇవ్వలేని నేపథ్యంలో చాలామంది టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు పార్టీ గోడ దూకడానికి రెడీగా ఉన్నట్లు తెలంగాణ రాజకీయవర్గాలలో టాక్ నడుస్తోంది. ఇదే క్రమంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది దుబ్బాక ఉపఎన్నికల ఫలితాల దెబ్బకి బిజెపి లోకి వెళ్ళటానికి ఆరాట పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్ పార్టీ కీలక నేత మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ తో బేటీ అవ్వటం తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది. గత కొంత కాలం నుండి స్వామిగౌడ్ టిఆర్ఎస్ పార్టీ పై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసిన బిజెపి స్వామి గౌడ్ ని పార్టీలోకి రావాలని బండి సంజయ్ స్వామి ని కోరడం జరిగింది.
స్వామి గౌడ్ తో బండి సంజయ్ తో పాటు లక్ష్మణ్ కూడా భేటీ అయ్యారు. మరోపక్క కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఇప్పటికే కాషాయ పార్టీ లోకి చేరడానికి రెడీ అవగా, ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ స్టార్ట్ చేసిన ఆపరేషన్ ఆకర్ష్ కి మాత్రం మంచి రెస్పాన్స్ రావడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.