(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
బిెజెపి చేపట్టిన చలో అమలాపురం కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు, నిరసనలకు దారి తీసింది. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చలో అమలాపురం పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అమలాపురంలో 144 సెక్షన్ విధించారు. భారీ ఎత్తున పోలీసు బలగాలను దింపి బయటి వ్యక్తులు పట్టణంలోకి ప్రవేశించకుండా స్టాపర్ లు ఏర్పాటు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమలావురంలో వ్యాపార వాణిజ్య సంస్థలను స్వచ్చందంగా మూసివేశారు. కాగా అమలాపురం చేరుకోవడానికి సిద్ధ పడుతున్న బిజెపి, అనుబంధ సంఘాల నేతలను ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి,
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ నాయకురాలు దగ్గుబాటి పురంద్రేశ్వరి వంటి ముఖ్య నాయకులను హౌస్ అరెస్టు చేయగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. మాజీ మంత్రి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిషోర్ బాబును హనుమాన్ జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తాడేపల్లిలోని సోము వీర్రాజు నివాసానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. ఆయన్ను హౌస్ అరెస్టు చేయడంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
చలో అమలాపురం కార్యక్రమం భగ్నంకు పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. తహశీల్దార్ కార్యాలయాల వద్ద నిరసనలు వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని, ఆలయాలపై దాడులకు సంబంధించి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?