దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో మళ్ళీ కేసుల విజృంభణ ఆందోళన కలిగిస్తున్నది. సామాన్యుని నుండి ప్రముఖులు రాజకీయ నేతలు కరోనా బారిన పడుతున్నారు. రెండోసారి కరోనా బారిన పడుతున్న వారు ఉన్నారు.
నేడు తాజాగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తన ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని తెలిపారు. “కరోనా వైరస్ ప్రారంభ లక్షణాలను కనిపించిన వెంటనే పరీక్ష చేయించుకున్నాను. ఫలితం పాజిటివ్ అని వచ్చింది. వైద్యుల సూచన మేరకు అన్ని మార్గదర్శకాలు పాటిస్తూ హోం ఐసోలేషన్ లో ఉంటున్నాను. నా ఆరోగ్యం బాగుంది. గత కొద్ది రోజులుగా నన్ను సంప్రదించిన వారు, దగ్గరగా మెలిగిన వారు టెస్ట్ చేయించుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి” అని నడ్డా విజ్ఞప్తి చేశారు.
నడ్డా రెండు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ లో పర్యటించి వచ్చారు. అంతకు రెండు రోజుల ముందు తెలంగాణ బీజేపీ నేతలు కలసి వచ్చారు. విజయశాంతి అయన ఇంటికి వెళ్లి మరీ కండువా కప్పించుకున్నారు. నడ్డా కు కరోనా పాజిటివ్ అని తెలియడంతో కొద్ది రోజులుగా ఆయనను కలసిన నేతలు అందరూ ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్ అవుతున్నారు.