ఏపీలో ఒక బీజేపీ, కేంద్రంలో ఒక బీజేపీ అని రెండు బీజేపీలు లేవు.. భారతదేశం మొత్తం ఉన్నది ఒకటే భారతీయ జనతా పార్టీ అని లంకా దినకర్ లాంటి ఏపీ బీజేపీ నేతలు పైకి ఎంతగా ప్రజలను నమ్మించే పనికి పూనుకున్నా… అది వేరు ఇది వేరని… లేదు రెండూ ఒకటే అంటే… వాటికున్న నాలుకలు అయినా రెండు ఉండి ఉండాలి అని ఫిక్సయిపోతున్నారు ఏపీ వాసులు! రాజధాని విషయంలో వారు అనుసరిస్తోన్న ద్వంద్వ వైఖరే దీనికి కారణం!
మూడు రాజధానుల బిల్లుకి సంబంధించి కన్నా లక్ష్మినారాయణ.. గవర్నర్కి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే, కన్నా లక్ష్మినారాయణ ఈ లేఖను తనకుతాను చెబుతున్న అభిప్రాయంగా కాకుండా.. పార్టీ అధ్యక్షుడి హోదాలో రాయడంతో బీజేపీలో ముసలం పుట్టిస్తోందట. “అధిష్టానానికి చెప్పకుండా కన్నా లక్ష్మినారాయణ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు..” అంటూ బీజేపీకే చెందిన ఓ ఢిల్లీ స్థాయి నాయకుడు అసహనం వ్యక్తం చేస్తున్నారట. దానికి కారణం… ఏపీ 3 రాజధానుల విషయంలో ఆ నేత వేరే అభిప్రాయాన్ని చెప్పడం!
ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పే ఒక సీనియర్ నేత… రాజధాని కి సంబందించిన విషయం పూర్తిగా ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని.. అందులో కేంద్రం జోక్యం చేసుకోదని క్లారిటీ ఇచ్చారు! జాతీయ స్థాయి నేతలు అలా చెప్పిన క్రమంలో.. కన్నా ఇలా సొంతపెత్తనం చేయడం సరైన చర్య కాదంటూ… సదరు సీనియర్.. హస్తినలో కన్నాపై ఫిర్యాదు కూడా చేశారంట. అయితే అది వాళ్ల ఇంటర్నల్ వ్యవహారం కాబట్టి… అసలు రాజధాని విషయంలో బీజేపీ రెండు నాలుకల సిద్ధాంతాన్ని పునికిపుచ్చుకుందని భావించాలేమో అనేది ఇప్పుడు ఏపీ వాసుల మాటగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
ఇంతకూ ఏపీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై స్థానికంగా గుంటూరు జిల్లా నేతగా కన్నా స్పందించారా.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా స్పందించారా.. ఢిల్లీలో స్పందించిన సీనియర్ బీజేపీ నేతతో ఈయనకున్న విభేధాల వల్ల అలా స్పందించారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ… రెండు నాలుకల దోరణి మాత్రం ప్రస్తుతానికి కన్ ఫాం అంటున్నారు విశ్లేషకులు!