దుబ్బాక ఎన్నికల్లో సంచలన విజయం , గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారీగా పుంజుకున్న బీజేపీ రాష్ట్రంలో మరింత బలోపేతం అవడంపై కసరత్తు చేస్తోంది. ఇప్పటి నుంచి అందుకు తగిన వ్యూహాలు అమలు చేస్తోంది.
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ తొలిసారి హైదరాబాద్ పర్యటన దీనికి నిదర్శనం. ఆయన రాక సందర్భంగా చేసిన కామెంట్లు జరిగిన పనులు ఇందుకు తార్కాణమని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఎంట్రీలోనే ఏం జరిగిందంటే…
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా నియమితులైన తరుణ్ చుగ్ రాష్ట్ర బీజేపీ నేతలతో అయ్యారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రాష్ట్రంలో నిధులు, అధికారాన్ని దోచుకునే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు . రాష్ట్రాన్ని దోచుకోవడంలో ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా కరోనాతో అల్లాడుతోంటే సీఎం కేసీఆర్ మాత్రం తన 7 స్టార్ ఫాంహౌస్ లో రెస్ట్ తీసుకున్నారని మండిపడ్డారు. సచివాలయంలో ఎవరూ ఉండరని ఆయన ఎద్దేవాచేశారు. కుటుంబ పాలనతో లూటీ చేస్తున్నారని, తెలంగాణలో నిజాం సర్కార్ ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.
ఇతర పార్టీలన్నీ ఖాళీ అవుతున్నాయి…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, మురళీధర్ రావు సమక్షంలో కంటోన్మెంట్, మలక్ పేట నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మురళీధర్ రావు… తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని, వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో TRS కు దీటైన పార్టీ తమదేనని ప్రజలు గుర్తించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీలు పోటీలు పడి ఖాళీ అవుతున్నాయని గాంధీభవన్ పరిస్థితి కూడా అంతేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మ్యూజియంలోనే కనిపించే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు.