తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఎన్నికల్లో పోటీకి చాలా రోజుల క్రితమే టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. అధికార వైసీపీ కూడా అభ్యర్థి పేరును ఖరారు చేసింది. ఇక బీజేపీ -జనసేన కూటమి అభ్యర్థి ప్రకటించే విషయంలో కాస్తా వెనుకబడింది.
పోటీ విషయంలో ఇరుపార్టీలు క్లారిటీకి రాలేకపోయాయి. అభ్యర్థి ఎవరన్న సంగతి పక్కనపెడితే.. కనీసం ఏపార్టీ తరపున అభ్యర్థిని నిలపాలన్న విషయంలోనూ ఈ రెండు పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. అయితే ఇదంతా మొన్నటి మాట. శనివారంతో సీన్ మారింది. తిరుపతి సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రసంగంతో… పోటీ ఎవరు చేస్తారన్నది తేలిపోయింది. పోటీపై ఓ క్లారిటీ వచ్చేసినట్టయ్యింది. బీజేపీ అభ్యర్థిలో బరిలోకి దిగుతారని సోము వీర్రాజు స్పష్టం చేశారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ ఆయన కమల శ్రేణులకు పిలుపునిచ్చారు.
తిరుపతి పార్లమెంట్ బైపోల్లో బీజేఏపీ అభ్యర్థిని గెలిపిస్తే.. తిరుపతికి కేంద్రం మరిన్ని నిధులు మంజూరు చేస్తుందని ప్రకటించారు.కొద్దిగా వెనక్కి వెళితే …గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో పోటీ నుంచి తప్పుకొని బీజేపీ విజయాలకు కృషిచేసిన తమకు తిరుపతి పార్లమెంట్ స్థానం దక్కుతుందని జనసైనికులు భావించారు. ఇప్పుడు సోము వీర్రాజు వ్యాఖ్యలతో ఆ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా నిరుత్సాహానికి లోనయ్యే అవకాశముంది. తిరుపతి పార్లమెంట్ పరిధిలో జనసేనకు బలముందని.. తమ పార్టీ అభ్యర్థే పోటీలో ఉంచుతామని పవన్ భావించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో జనసేన బలపరచిన బహుజన సమాజ్ వాది పార్టీ అభ్యర్థికి 20,971 ఓట్లు రాగా, బిజెపి అభ్యర్థికి 16,125 ఓట్లు మాత్రమే వచ్చాయి.
తిరుపతి పార్లమెంట్ స్థానంలో : –
అంతేకాదు… తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉందని, అందులోనూ తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో చాలా పటిష్టంగా ఉన్నామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే జనసేన అభ్యర్థికి 12 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఈ లెక్కలన్నీ చూస్తే.. తిరుపతి పార్లమెంట్ స్థానములో బీజేపీకంటే తామే బలంగా ఉన్నామని జనసేన భావిస్తోంది. ఈ నిజాలన్నింటినీ పక్కనపెట్టి, జనసేనను బుట్టలో పెట్టి తిరుపతి స్థానాన్ని బిజెపి లాక్కుందని పవన్ జనసైనికులు ఆవేదన చెందుతున్నారు.