తెలంగాణాలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలవడంతో ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న తిరుపతి లోక్సభ ఉపఎన్నికలోనూ తమ సత్తా చాటాలని రాష్ట్ర బిజెపి ఉబలాటపడుతోంది. అయితే ఆ పార్టీకి అంత ఊపుఉందా అన్నదే అనుమానాస్పదం.
మొన్నటి ఎన్నికల్లో తిరుపతిలో గెలిచిన వైసీపీ అభ్యర్థి బలి దుర్గాప్రసాదరావు ఇటీవల కరోనాతోమృతి చెందగా త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది.ఏపీలో కొత్తగా జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం కొలువుదీరాక జరగబోయే తొలి ఉప ఎన్నిక కూడా ఇదే.ఎలాగూ వైసిపి అధికారంలో ఉంది కాబట్టి ఆ ఉప ఎన్నికను సీరియస్గానే తీసుకుంటుంది.సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవటానికి ప్రభుత్వ పరమైన ప్రయత్నాలు జరుగుతాయి.ఇక రాష్ట్రంలో ప్రధానప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తన వంతుగా తాను పోటీ పడుతుంది.అయితే 2019 ఎన్నికల్లో కేవలం పదహారు వేల ఓట్లను తిరుపతి లోక్సభ స్థానంలో సాధించిన బీజేపీ ఏకంగా ఇప్పుడు ఈ స్థానాన్ని ఉప ఎన్నికలో కైవసం చేసుకుంటామన్న రీతిలో బిల్డప్ ఇస్తుండటమే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
1999 లో ఒక్కసారి టిడిపితో పొత్తు ఉన్న నేపధ్యంలో బీజేపీ అభ్యర్థి వెంకటస్వామి తిరుపతి లోక్సభ స్థానంలో పదమూడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.2014లో మళ్లీ టిడిపి -బిజెపి కలిసికట్టుగా పోటీ చేయగా అదే లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి కారుమంచి జయరామ్ నలభై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.ఈ ఎన్నికల మినహాయిస్తే ఈ రెండు ఎన్నికలు మినహాయిస్తే బిజెపి ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఆ పార్టీ అభ్యర్థుల ఓట్లు ఈ లోక్సభ నియోజకవర్గంలో పాతికవేలు దాటలేదు.అదే తిరుపతిలో బిజెపికున్న పరపతి.ఈ పరిస్థితుల్లో అక్కడ గెలిచేస్తామని ఆ పార్టీ ఎలా చెబుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు.బహుశా తన మిత్రుడైన జనసేనాని పవన్ కల్యాణ్ కు తిరుపతిలో ఉన్న పాపులారిటీ ఆధారంగా బీజేపీకి ఓట్ల వర్షం కురుస్తుందని కమలనాథులు కలలు కంటున్నట్లు కనిపిస్తోంది .
మొన్నటి ఎన్నికల్లో తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో జనసేన తన అభ్యర్థిని నిలబెట్టలేదు. జనసేన మద్దతుతో పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థికి ఇరవై వేల ఓట్లు వచ్చాయి.అటు బీజేపీకి , ఇటు బీఎస్పీకి విడివిడిగా వచ్చిన ఓట్లకంటే నోటాకే అధికంగా ఇరవై అయిదు వేల ఓట్లు వచ్చాయి.కాబట్టి ఉప ఎన్నికలో ఏదో ఇరగదీసేస్తామని బీజేపీ అనుకోవడం తిరుపతి కొండకు దారం కత్తి లాగడమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.బీజేపీ జనసేన కలిసి పోటీ కలిసినా కూడా అక్కడ నెగ్గుకురాలేరు అంటున్నారు.దుబ్బాక తిరుపతికి చాలా తేడా ఉందని..పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా బీజేపీ వ్యవహరిస్తే దెబ్బతింటుందని వారు హెచ్చరిస్తున్నారు.