మొదటినుండి ఉత్తరాదిలో బలంగా ఉన్న బిజెపి దక్షిణాదిలో కూడా రాణించటానికి అనేక వ్యూహాలు వేస్తూ వచ్చింది. 2019 ఎన్నికలలో భారీ మెజార్టీతో కేంద్రంలో తన స్థానాన్ని పదిలం చేసుకున్న బీజేపీ తర్వాత కొన్ని రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో ఢీలా పడిపోయి ఇటీవల బీహార్ ఎన్నికలలో ఊహించని విధంగా గెలిచి సత్తా చాటింది.
ఇటువంటి పరిస్థితుల్లో ఇక ఇదే వేవ్ దేశమంతా ఉండాలని దక్షిణాదిలో కూడా రాణించాలనే ఉద్దేశంతో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొంతమంది కీలక నాయకులను జాయిన్ చేసుకున్న బీజేపీ, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన నటి కుష్బూను పార్టీలోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఆమెకు పార్టీ నుండి పోటీ చేయడానికి మంచి అవకాశమే దక్కుతుందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
ఇదిలా ఉండగా బిజెపి దక్షిణాదిలో మాత్రం నేరుగా కాకుండా ఇతర పార్టీల తో జత కట్టి రాణించాలని ఆలోచన చేస్తుందట. వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలని కాషాయ దళం ప్లాన్ చేస్తున్నట్లు టాక్. మరోపక్క రజినీకాంత్ కొత్త పార్టీ గురించి పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు ఇటువంటి తరుణంలో నేరుగా రజినీకాంత్ ని బీజేపీ లోకి తెచ్చుకునే మొత్తం పార్టీ బాధ్యతలన్నీ ఆయనకే అప్పజెప్పాలని కూడా బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా బిజెపి బలంగా లేని చోట్ల ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆ ప్రాంత రాజకీయాల్లో కీలకంగా రాణించాలని వ్యూహాలు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్.