గతరెండు రోజుల క్రితం అమరావతిలో రైతుల దీక్షకు ద్విశత దినోత్సవ కార్యక్రమం జరిగింది. సుమారు 200 దేశాల్లో ఈ కార్యక్రమం జరిగిందని.. అన్ని దేశాల్లోనూ ఉన్న టీడీపీ కార్యకర్తలు, గుంటూరు – కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని.. ఫ్లకార్డులు చేతబూని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది కానీ… గత కొన్ని రోజులుగా మిగిలిన పక్షాల నుంచి కాస్త గట్టిగా, టీడీపీ నుంచి ఒక మోస్తరుగా వినిపిస్తున్న మాట… బీజేపీ నుంచి క్లారిటీ కావాలని, ప్రధాని కల్పించుకోవాలని!
అయితే… తాజాగా బీజేపీ నుంచి ఒకమోస్తరు క్లారిటీ వచ్చిందనే విషయం బీజేపీ నేత సునీల్ దేవధర్ నుంచి, వారి మిత్రుడు జనసేన పవన్ నుంచి వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు! “అమరావతి రైతులకు అన్యాయం జరిగితే మాత్రం జనసేన – బీజేపీలు పోరాడతాయని… రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని” చెబుతున్నారు సునీల్ దేవధర్! ఆ మాట కాసేపు పక్కన పెడితే… జనసేనాని పవన్ స్పందనను కూడా ఒకసారి పరిశీలిద్దాం!
“రైతులు చేసిన త్యాగాలను వృథా కానివ్వబోము.. రైతుల పోరాటానికి తాము కూడా మద్దతిస్తాము.. బీజేపీతో కలిసి రైతులకు అండగా నిలబడతాము.. రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు విషయంలో కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు..” అని అన్నారు పవన్! ఇక్కడ సరిగ్గా గమనిస్తే… బీజేపీ – జనసేనల నుంచి రాజధాని విషయంలో పూర్తి క్లారిటీ వచ్చినట్లేనని అంటున్నారు విశ్లేషకులు.
అంటే… ఇక్కడ రెండు క్లారిటీలు ఉన్నాయి! “అమరావతి రైతులకు అన్యాయం జరిగినా.. కౌలు ఇవ్వడంలో తాత్సార్యం చేసినా.. బీజేపీ – జనసేన కూటమి పోరాడుతుంది.. రైతుల పక్షాన నిలబడుతుంది” అనేది ఒక క్లారిటీ కాగా… “రాజధాని విశాఖకు వెళ్లినా, కర్నూలు వెళ్లినా తమకు అభ్యంతరం లేదు.. అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం” అనేది రెండో క్లారిటీ అని అంటున్నారు విశ్లేషకులు! సో… బీజేపీనే కాదు.. పరోక్షంగా జనసేన కూడా అమరావతిపై క్లారిటీ ఇచ్చేసినట్లే ననే కామెంట్లు వినిపిస్తున్నాయి!!