Bjp – Janasena : ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పని చేయనున్నాయి. ఇదే విషయాన్ని తెలుపుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ పేరిట ప్రకటన విడుదల చేశారు.
‘తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని జనసేన, భారతీయ జనతా పార్టీలు నిర్ణయించాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పార్టీ నాయకులు బీజేపీతో చర్చలు జరిపారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో కలిసి పోటీ చేయడంపై ఇరు పార్టీల నేతల మధ్య స్థూలంగా ఒక ఒప్పందం కుదిరింది. ఎవరెవరు ఎక్కడెక్కడ పోలీ చేయాలనేది మరోసారి జరిగే చర్చల్లో నిర్ణయం జరుగుతుంది. ఈ చర్చల్లో జనసేన పార్టీ తరఫున పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ వివి రామారావు, బీజేపీ తరఫున ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, కినాస్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.’ అని హరిప్రసాద్ ఆ ప్రకటన లో వివరించారు.
Bjp – Janasena: కలిసి ..విడిపోయి ..మళ్లీ కలిసి!
దుబ్బాక, హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ-జనసేన పార్టీలు.. ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేరు పడ్డాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీ దేవికి మద్దతు ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటన చేశారు. పీవీ కుమార్తె సురభి వాణి దేవికే తమ మద్ధతు ఉంటుందని పవన్ మీడియా ముందు స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ ప్రకటన తరువాత బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తమను వాడుకుని వదిలేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై తమనకు కనీసం సంప్రదించలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే.. పవన్ ప్రకటనతో బీజేపీ నేతలు కంగుతిన్నారు. పవన్ ప్రకటన పొత్తు ధర్మాన్ని విస్మరించడమేనని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ప్రకటన విడుదల అవడంతో బీజేపీ, జనసేన పార్టీలు అప్రమత్తమయ్యాయి. కలిసి పోటీ చేయడంపై చర్చించారు. చర్చలు సఫలం అవడంతో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించి అదే విషయాన్ని మీడియా కి తెలియజేశారు.