వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో తిరుపతిలో ఉప ఎన్నికలు షురూ అయిన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలు అన్నీ ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో బిజెపి జనసేన మిత్రపక్షంగా పైకి కనిపిస్తున్నా ఈ ఉప ఎన్నికల్లో రెండు పార్టీల తీరు ఎవరికివారు అన్నట్టుగా ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
పూర్తి మేటర్ లోకి వెళ్తే 45 మండలాల్లోని పోలింగ్ కేంద్రాలలో 15 మంది రాష్ట్ర స్థాయి నేతల ఇన్చార్జి లతో రెడీ అవుతుంది ఏపీ బీజేపీ. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో మెయిన్ పొలిటికల్ పార్టీ గా సత్తా చాటాలని తిరుపతి ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని ఏపీ కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మిత్రపక్షంగా ఉన్న జనసేన బలపరిచిన బిజెపి అభ్యర్థినే పోటీలోకి దింపుతున్నట్లు సోము వీర్రాజు తేల్చేశారు.
ఆలస్యమైతే ఎక్కడ ఈ సీటు పవన్ తన్నుకు పోతాడో అన్న రీతిలో సోము వీర్రాజు ప్రకటనలు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ తిరుపతిలో పది మంది పార్టీ నాయకులతో యాక్షన్ కమిటీ వేయటం రెండు పార్టీలో చర్చనీయాంశమైంది. దీంతో తిరుపతి సీటు వదులుకోవటానికి జనసేన లేదని టాక్ వస్తోంది. ఈ విధంగా యాక్షన్ కమిటీని నియమించి తిరుపతి లోక్ సభ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలలో పర్యటించాలని పవన్ ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ నిర్ణయంతో తిరుపతిలో మంచి స్పీడ్ మీద ఉన్న బీజేపీకి జనసేన బ్రేక్ వేసినట్లయింది. ఇదే క్రమంలో పవన్ డిల్లీ పర్యటన చేయటంతో బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అనే కొత్త పదాన్ని తెరపైకి తెచ్చారు. ఏది ఏమైనా తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేన ఎవరికి వారు అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్లు ఏపీ రాజకీయ వర్గాలలో టాక్ నడుస్తోంది.