BJP : విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తప్పుబడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పునరాలోచించాలని.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సెటైర్లు వేశారు. గంటా రాజీనామా వ్యవహారం ఒక చీప్ ట్రిక్, పబ్లిసిటీ కోసం ఎప్పుడు ఆరాటమే గంటాకి ముఖ్యం అంటూ తీవ్ర స్థాయిలో డైలాగులు వేశారు. ఇదే క్రమంలో గంటా రాజీనామా ఆమోదిస్తే నియోజకవర్గ ప్రజలు ఎంతగానో ఆనంద పడతారు అని పేర్కొన్నారు.
నిజంగా గంటా శ్రీనివాస్ కి చిత్తశుద్ధి ఉంటే స్పీకర్ ఫార్మెట్ లో ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఇదే క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ స్టాండ్ ఏమిటో పురందేశ్వరి విశాఖపట్టణానికి వచ్చాక మీడియా సమావేశంలో చెబుతామని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. నిజంగా గంటా శ్రీనివాస రాజీనామా వైజాగ్ లో కార్మిక సంఘాలు ఆందోళనలు నిరసనలు ర్యాలీలు చేయకముందు చేసి ఉంటే చిత్తశుద్ధి ఉండేదని కానీ పబ్లిసిటీ కోసం దాదాపు 18 నెలల పాటు ఆయనను ఎవరు పట్టించుకోకపోవడంతో వార్తల్లో నిలవడం కోసం గంటా రాజీనామా డ్రామా ఆడుతున్నట్లు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఇదే క్రమంలో ఈ నెల 14వ తారీకు ఏపీ బీజేపీ నేతలంతా కేంద్ర పెద్దలతో సమావేశం అవుతున్నట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మంతనాలు జరపడానికి రెడీ అవుతున్నట్లు విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.