శ్రీనగర్: కాశ్మీర్లో ఉగ్రవాదులు మరో సారి రెచ్చిపోయారు. నౌగమ్ వేరినాగ్ ప్రాంతంలో అనంతనాగ్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు గుల్ మహ్మద్ మిర్పై శనివారం రాత్రి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రగాయాలపాలయిన ఆయన్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.
భద్రతాదళాలు ఘటనా స్థలానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మీర్ హత్యను బిజెపి జమ్ముకాశ్మీర్ శాఖ తీవ్రంగా ఖండించింది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేసింది. కాశ్మీర్ లోయలో హింసాత్మక సంఘటనలకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ప్రధాని నరేంద్ర మోది, నేషనల్ కాన్షరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా, పిడిపి అధినేత్రి మెహబూబా మఫ్తీ, జమ్ముకాశ్మీర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జివి మిర్లు కూడా ఘటనను తీవ్రంగా ఖండించారు.