ఏపీలో అతి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి మరింత బలమైన కొత్త శత్రువు తయారయ్యాడు.ఇప్పటికే అధికార వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో అష్టకష్టాలు పడుతున్న టీడీపీ ఇప్పుడు బీజేపీని చూసి కూడా బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఉత్సాహంతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ మంచి ఊపు మీద ఉంది.తెలంగాణలో అధికారపక్షమైన టీఆర్ఎస్ కు చెమటలు పట్టిస్తున్నారు .ఇప్పుడు బీజేపీ కన్ను ఆంధ్రప్రదేశ్ పై కూడా పడింది .ఇందుకు నాందిగా తిరుపతి ఉప ఎన్నికలో సత్తా చూపాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు.ఏడాదిన్నర పాలన అనంతరం అంతో ఇంతో జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత పొడచూపుతున్న నేపధ్యంలో దాన్ని క్యాష్ చేసుకుందామని టిడిపి పథక రచనలో ఉండగా బిజెపి దూసుకొస్తోంది.అంతేగాకుండా కొందరు కీలక టిడిపి నేతలకు బీజేపీ గాలం వేస్తోంది.
టిడిపి నేతలు చాలామందిని వైసిపి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేయడంతో కొందరు అటు వెళ్ళిపోయారు.ఇంకొంత మంది టీడీపీకి మనుగడ లేదని భావిస్తూ పక్కచూపులు చూస్తున్నారు.అలాంటి వారిని బిజెపి ఎంపిక చేసుకుంటోందట.ముఖ్యంగా రాయలసీమ కోస్తా ఆంధ్రలో ఎనిమిది నుండి పది మంది టిడిపి అగ్రనేతలను బిజెపి దువ్వుతోందని సమాచారం.వీరు గనుక కమలనాథులతో కరచాలనం చేస్తే టీడీపీకి గడ్డు పరిస్థితి ఎదురవుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.బీజేపీతో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పొత్తు కూడా టీడీపీకి మైనస్ పాయింటే.ఈ ఎఫెక్ట్ రేపు తిరుపతి ఉప ఎన్నికల్లోనే కనిపించబోతోందని ఒక విశ్లేషణ సాగుతోంది.
నిజానికి బిజెపి రాష్ట్రంలో బలోపేతం అవుతుందంటే ఆందోళన చెందాల్సింది వైసిపి.పోలవరం ప్రాజెక్టు అమరావతి వంటి విషయాల్లో బిజెపికి వైసిపికి పొసగడం లేదు.అయినప్పటికీ పూర్తిస్థాయిలో బిజెపి మీద వైసిపి ధ్వజమెత్తడం లేదు.టిడిపి నేతలను టార్గెట్ చేసినట్లుగా బీజేపీ నేతల వెనక జగన్ ప్రభుత్వం పడడం లేదు.బీజేపీ రాష్ట్రంలో ఎదిగితే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ప్రభావం తగ్గిపోతుందని ఆ తర్వాత బీజేపీ విషయం చూసుకుందాంలే అని వైసిపి వ్యూహాత్మక ఆలోచనలో ఉందని చెబుతున్నారు.మొత్తం మీద టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి మాదిరిగా తయారైంది.ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటానని చెప్పే చంద్రబాబు ఈ పరిస్థితుల్లో ఏ విధంగా రాజకీయ చక్రం తిప్పుతారో చూడాలి .