Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శాససనభ నుండి ఈటలను సస్పెండ్ చేశారు. స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్ క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేయగా, అందుకు ఈటల అంగీకరించలేదు. దీంతో ఈటెల ను సస్పెండ్ చేయాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ ఈటల ను ఈ సమావేశాలు పూర్తి అయ్యే వరకూ శాసనసభ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
తొలుత ఈటలపై టీఆర్ఎస్ సభ్యులు మండిపడ్డారు. స్పీకర్ ను మర మనిషి అంటూ ఈటల సంభోధించారనీ, సభకు వెంటనే ఆయన క్షమాపణ చేప్పాలని ఎమ్మెల్యే దానం నాగేందర్, వినయ్ భాస్కర్ లు కోరారు. సభలో కొనసాగే అర్హత ఈటలకు లేదని మరో సభ్యుడు బాల్క సుమన్ అన్నారు. ఈ తరుణంలో ఈటల మాట్లాడే ప్రయత్నం చేయగా, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలుగజేసుకుని క్షమాపణలు చెప్పిన తర్వాతే సభలో పాల్గొనాలని కోరారు. సస్పెండ్ చేయించుకోవాలనే ఈటల చూస్తున్నారని విమర్శించారు. ఈటల సభలో ఉండాలనే తాము కోరుకుంటున్నామనీ, క్షమాపణలు చెప్పి సభలో జరిగే అన్ని చర్చల్లో పాల్గొనాలని మంత్రి చెప్పారు. అలా జరగని పక్షంలో తదుపరి చర్యలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.
ఈటలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తుండటంతో ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుడుగా సభలో మాట్లాడే అవకాశం తనకు ఉందా లేదా బెదిరిస్తున్నారా ఏం చేసేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ తరుణంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈటల సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టడం, స్పీకర్ ఆయన్ను సస్పెండ్ చేయడం జరిగింది. అనంతరం సభ నుండి బయటకు వచ్చిన ఈటల .. తన వాహనంలో వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తాను చెప్పింది అబద్దమని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ కేంద్రానికి సీఎం కేసిఆర్ సవాల్