హైదరాబాద్: విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో వంద ఆవులు అనుమానాస్పద రీతిలో ఒకే సారి మృతి చెందడంపై గోషామహాల్ బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ఆవులు చనిపోయాయంటే అక్కడ కుట్ర కోణం ఉందని ఆయన ఆరోపించారు. తమకు అందిన సమాచారం ప్రకారం స్థానికంగా గోశాల స్థలంపై గొడవ ఉన్నట్లు తెలిసిందనీ, అక్కడి భూమి ఖరీదుగా మారిపోవడంతో కొన్ని దుష్టశక్తుల కన్ను ఆ గోశాల భూములపై పడిందని రాజా సింగ్ ఆరోపించారు. ఆ గోశాలలో కూడా రెండు గ్రూపులు ఉన్నాయని తెలిసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఒకటి రెండు రోజుల్లో తాము గోశాలను సందర్శిస్తామని ఆయన తెలిపారు.
గోశాలలో శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకూ వంద ఆవులు మృతి చెందిన విషయం తెలిసిందే. చనిపోయిన ఆవుల కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించిన పశు సంవర్థక శాఖ వైద్యులు విషాహారం వల్లనే అవి చనిపోయాయని ధృవీకరణ చేశారు.