BJP MP GVL: ఏపి ప్రభుత్వంపై బీజేపీ దూకుడు పెంచింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిశానిర్దేశం తరువాత ఆ పార్టీ నేతల్లో తీవ్ర మార్పు వచ్చింది. రాజధాని అమరావతి విషయంలో తమ వైఖరి మార్చుకుని అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు విమర్శల దాడి పెంచారు. ఈ క్రమంలో భాగంగా నేడు ఢిల్లీలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సందర్భంగా వైసీపీ అంటే కొత్త అర్ధాన్ని చెప్పారు జీవిఎల్.
BJP MP GVL: ఏమి చేతగాని ప్రభుత్వం
వైసీపీ అంటే ఏమి చేతగాని ప్రభుత్వంగా జీవిఎల్ అభివర్ణించారు. ఈ మాటలు ఎందుకు అందుకు అంటున్నాను అంటే కేంద్ర ప్రభుత్వం అపారంగా నిధులు ఇస్తున్నా పూర్తి గా వైఫల్యం చెందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలకు నిధులు ఇచ్చినా నిరుపయోగం అవుతున్నాయని ఆయన విమర్శించారు. కేంద్రం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను పూర్తిగా ఉపయోగించుకోలేని పరిస్థితి కనబడుతోందని అన్నారు. లిమిట్స్ మించి రాష్ట్రం అప్పులు చేసిందని అన్నారు. నిబంధనలు తుంగలోకి తొక్కి కార్పోరేషన్ ల ద్వారా అప్పులు చేశారని ఆరోపించారు. ఆర్ధిక వైఫల్యాలకు కేస్ స్టడీలా ఏపి తయారు అయ్యిందని జీవిఎల్ అన్నారు.
28న విజయవాడలో బీజేపీ బహిరంగ సభ
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈ నెల 28న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం మాచింగ్ గ్రాంట్ విడుదల చేయకపోవడంతో కేంద్ర నిధులూ రావడం లేదన్నారు. వైసీపీ చేతకానితనంతో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిందన్నారు. ఉత్తరప్రదేశ్ తర్వాత ఎక్కువ నిధులు కేంద్రం ఇచ్చింది ఏపికేనని పేర్కొన్నారు. కేంద్ర పథకాలకు సొంత పేర్లు పెట్టి రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని జీవిఎల్ డిమాండ్ చేశారు.