అమరావతి: రాజధాని ప్రాంత రైతులతో బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ను కలిశారు. రాజధాని ప్రాంత రైతుల సమస్యలను గవర్నర్కు వివరించారు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో రాజధాని ప్రాంత రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటన కోసం రైతులు ఎదురుచూస్తున్నారని సుజన చౌదరి పేర్కొన్నారు. రాజధానిపై సిఎం జగన్ స్పష్టత ఇచ్చేలా చూడాలని గవర్నర్ను సుజనా చౌదరి కోరారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ రాజధాని ప్రాంత రైతాంగంలో భయాన్ని పోగొట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రకటన ఇవ్వాలని కోరారు.
మంత్రి బొత్సా వ్యాఖ్యల అనంతరం రాజధాని ప్రాంత రైతుల్లో అయోమయం, ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల కోరిక మేరకు ఆ ప్రాంతంలో బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి సుజనా చౌదరి ఇటీవల పర్యటించారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అమరావతి ప్రాంతంలో పర్యటించి రాజధాని తరలించడానికి ఒప్పుకునే ప్రశ్నలేదని స్పష్టం చేశారు. వివిధ రాజకీయ పక్షాల నేతలు రాజధానిపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంత వరకూ సిఎం జగన్ నేరుగా ప్రకటన ఇవ్వలేదు. మంత్రులు మాత్రం రాజధాని మారుస్తామని ముఖ్యమంత్రి ఎక్కడా చెప్పలేదని పేర్కొంటూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆ ప్రాంత రైతులతో గవర్నర్ను కలిసి వినతి పత్రం ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.