ఏపిలో వైసీపీ ప్రభుత్వంపై బిజెపి వార్ ప్రారంభించిందా? అంతర్వేది, విజయవాడ తదితర ఘటనలు వారికి అస్త్రాలుగా మారుతున్నాయా? రాష్ట్రంలో బిజెపి బలపడేందుకు పునాది వేసుకుంటుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటి వరకూ వైసిపి ప్రభుత్వంపై అనుకూల ధోరణి వ్యవహరించే బిజెపి నేతలు సైతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనపై కేంద్రానికి పిర్యాదు చేశారు అంటే ఆ వాదనకు బలం చేకూరుతోంది. బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఏపిలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంలో జివిఎల్ నర్శింహరావు ఏమన్నారంటే.. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని నెలలుగా హిందూ దేవాలయలపై దాడులు జరుగుతున్నాయనీ, హిందూ దేవతలను అపవిత్రం చేసిన అనేక ఘటనలు చోటు చేసుకున్నాయనీ అన్నారు. అంతర్వేదిలోని పురాతన శ్రీ లక్ష్మీనర్శింహస్వామి ఆలయానికి చెందిన 62 ఏళ్ల రథాన్ని తగులబెట్టారని, అదే విధంగా విజయవాడ దుర్గగుడిలో వెండి సింహాలు అదృశ్యం అయ్యాయనీ, ఇలా మొత్తం మీద 18 సంఘటనలు జరిగాయని వివరించారు జివిఎల్. హిందువుల మతపరమైన భావాలకు ఏపిలో తీవ్ర హాని జరుగుతుందని విమర్శించారు. అంతర్వేది ఘటనపై శాంతి యుత నిరసనలు చేపడితే కేసులు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు. చర్చిపై రాళ్లు రువ్వారన్న అభియోగంపై 41మంది హిందువులను అరెస్టు చేసి 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ కు పంపారనీ, గుంటూరులో పోలీస్ స్టేషన్ లో దాడి చేసిన ముస్లింలపై సాక్షాలు ఉన్నా వైసీపీ ప్రభుత్వం ఇీటవల వారిపై ఉన్న ఎఫ్ఐఆర్ రద్దు చేసిందన్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తోందని విమర్శించారు జివిఎల్. ముస్లిం, క్రైస్తవుల పట్ల బుజ్జగింపు చర్యలు, హిందువుల పట్ల కేసులను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వైసిపి ప్రభుత్వం చేసే అప్రజాస్వామిక విధానాల పట్ల కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జీవిఎల్ డిమాండ్ చేశారు.