బిజెపి సీనియర్ నేత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కరోనా కారణంగా మృతి చెందారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం ఎమ్మెల్యేగా మాణిక్యాల రావు గతంలో పనిచేసారు.
పట్టణంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఆయనకు కొద్ది రోజుల క్రితం కరోనా సోకింది. అప్పటినుండి విజయవాడలోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఫోటోగ్రాఫర్ గా కెరీర్ ను ప్రారంభించిన మాణిక్యాలరావు అంచెలంచలుగా రాజకీయాల్లో ఎదిగారు. 2014లో బీజేపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలి ప్రయత్నంలోనే మంత్రిగా అవకాశం లభించడం విశేషం. దేవాదాయ శాఖ మంత్రిగా మాణిక్యాల రావు సేవలందించారు. కరోనా సోకిన నేపథ్యంలో ఆయన వీడియో చేసి అభిమానులను కుదుటపరిచే ప్రయత్నం చేసారు. కరోనా సోకినా భయపడాల్సిన అవసరం లేదని తన అభిమానులకు ఈ వీడియోలో ధైర్యం చెప్పారు.
పైడికొండల మాణిక్యాలరావు మృతిపట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిపించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.