ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విషయంలో అనుసరించిన రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
2014లో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అనంతరం 2018 నుంచి ప్లేట్ ఫిరాయించారు. బీజేపీని ఎదిరించారు. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత ఆయన మళ్లీ బీజేపీ దగ్గరకు చేరేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. అయితే , బీజేపీ నో చాన్స్ అంటోంది. తాజాగా బీజేపీ విషయంలో బాబు డ్యుయల్ స్టాండ్ను ఆ పార్టీ బయటపెట్టింది!.
వాళ్లతో కలిసిన చంద్రబాబు
కొత్త వ్యవసాయ చట్టం బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళన ఉధృత రూపం దాల్చి రేపు దేశవ్యాప్త బంద్కు రైతులు పిలుపు ఇచ్చారు. దీనికి వివిధ రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చారు. దీనిపైనే బీజేపీ భగ్గుమంటోంది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్. విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్లో చంద్రబాబు తీరును ఎండగట్టారు. “*చంద్రబాబు గారు మీరు మారరా?* “ అంటూ బాబు తీరును ఎద్దేవా చేశారు.
ఆనాడేం జరిగిందో తెలుసా బాబు?
చంద్రబాబు డబుల్ స్టాండ్ను ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. “పార్లమెంట్లో వ్యవసాయ బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఆరోజు మాట్లాడినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా ? అసలు మీరు అనుకూలమా వ్యతిరేకమా ? వ్యతిరేకమైతే అప్పుడు ఎందుకుమద్దతిచ్చారు. ఒకసారి తిరిగితే “U”యూ టర్న్ అంటారు. ఇన్ని సార్లు తిరిగితే దాన్ని ఎమనాలి?“ అంటూ చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు.
క్షమించే చాన్సే లేదు
మీరు గతంలో వ్యవసాయం గురించి మాట్లాడిన మాటలు చేసిన, పనులు గుర్తుకులేవా అంటూ చంద్రబాబు పరిపాలన గురించి బీజేపీ నేత కామెంట్ చేశారు. “మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2000 సంవత్సరం అగస్టు 23 తేదిన బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు, గుర్రాలతో తొక్కించడం చేశారు. అదేరోజు పోలీసు కాల్పులలో విష్ణువర్ధన్ రెడ్డి ,రామకృష్ణ, బాలస్వామి అనే ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. వారు మీకు గుర్తున్నారా?“ అంటూ ప్రశ్నించారు. “నరేంద్ర మోది ప్రభుత్వం రైతుల కోసం మంచి బిల్లు తెస్తే మీరు , మీ పార్టీ , దీనిని రాజకీయం చేస్తారా ? మీ మిత్ర పక్షం కాంగ్రెస్ , కమ్యూనిస్టు పార్టీ లు రైతు విషయంలో ఆడుతున్న నాటకంలో మీరు పాత్రధారులు అనే విషయం ప్రజలకు అర్థమవుతోంది. కాబట్టి మిమ్మల్ని రైతాంగం ఏప్పటికి క్షమించదు.“ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.