జనసేన పార్టీ అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను మిత్రపక్షమైన బీజేపీ టార్గెట్ చేసిందని ప్రచారం జరుగుతోంది. పైకి ఓ రకంగా ప్రచారం చేస్తున్న లోలోపల మాత్రం ఆయన్ను పలుచ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని జనసేన వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. తిరుపతి లోక్సభ ఉపఎన్నిక విషయంలో మిత్రపక్షం జనసేన విషయంలో బీజేపీ ఇస్తున్న లీకులు , జరుగుతున్న ప్రచారం దీనికి నిదర్శనం.
తిరుపతి రచ్చ ఏంది?
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసి మరి దూసుకుపోతుంటే బీజేపీ జనసేన పార్టీలు మాత్రం ఇంకా అంతర్గత రాజకీయాలతో సతమతం అవుతున్నాయంటున్నారు. మిత్రపక్షమైన జనసేనను లైట్ తీసుకొని ఇటీవల తిరుపతిలో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. వాస్తవానికి శోభాయాత్రకు కమలనాథులు నిర్ణయం తీసుకున్న సమయంలో జనసేన వారిని కూడా పిలుద్దామనే ప్రస్తావన వచ్చిందట. ఆ సమయంలో జనసేన అవసరమే లేదని సొంతంగానే ర్యాలీకి వెళ్దామని బీజేపీ నేతలు చెప్పారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి జనసేన నాయకులు తీవ్రంగా రగిలిపోతున్నారట.
పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఆధారాలు రెడీ ?
జనసేన మిత్ర పక్షమంటూనే వీర్రాజు ఆ పార్టీని లైట్ తీసుకుంటున్నారు. తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి పోటీచేస్తారని వీర్రాజు ప్రకటించారు. తిరుపతి లోక్సభ ఉపఎన్నిక విషయంలో మిత్రపక్షం జనసేన ఇచ్చిన షాక్తో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని జనసైనికులు వాపోతున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని దెప్పి పొడుస్తున్నారు . ఉమ్మడి అభ్యర్థిని డిసైడ్ చేసేది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అయితే మధ్యలో సోము వీర్రాజుకు ఏం పని? అని ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు సంచలనంగా మారాయి. అయితే, బీజేపీ ఈ విమర్శలను తేలికగా తీసుకోవడం లేదని , వీటన్నింటినీ రికార్డు చేసి ఢిల్లీ పెద్దలకు చూపించి పవన్ కళ్యాణ్ ను బుక్ చేయడం ఖాయమని మరికొందరు అంటున్నారు.