Pawan Kalyan : పవన్ కల్యాణ్ Pawan Kalyan తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా నేడు పవన్ తిరుపతిలో పర్యటిస్తున్నారు. బీజేపీతో పొత్తు నేపథ్యంలో తమ ఉమ్మడి అభ్యర్ధి రత్నప్రభ గెలుపు కోసం ప్రచారం చేస్తారు. ఇప్పటికే పవనే మా సీఎం అభ్యర్ధి అంటూ బీజేపీ ప్రచారంలో దూసుకెళ్లింది. ఈ ఎన్నికలకు ఆ ప్రకటనకు సంబంధం లేకపోయినా రాజకీయంగా హీటెక్కించింది. మరోవైపు.. ‘పవన్ సీఎం అభ్యర్ధి అనే విషయం నాకు తెలీదు’ అన్నారు రత్నప్రభ. ఇవన్నీ బీజేపీ-జనసేన మైత్రిపై మళ్లీ సందేహాలు, అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇదంతా పక్కనపెడితే.. ముందుగానే సీఎం అభ్యర్ధిని ప్రకటించడం బీజేపీ స్ట్రాటజీలో భాగం అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ప్రస్తుతం కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళలో కమ్యూనిస్టుల హవా ఎక్కువ. కేరళలో ఇప్పటివరకూ బీజేపీకి సరైన ట్రాక్ రికార్డు లేదు. నాయకులు గెలిచిన సందర్భాలూ తక్కువే. అటువంటి కేరళలో బీజేపీ ఏకంగా సీఎం అభ్యర్ధిగా మెట్రో శ్రీధరన్ పేరు ప్రకటించింది. శ్రీధరన్ కు మంచి పేరు ఉంది. కానీ.. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేంత అయితే కాదనేది నిజం. ఆమధ్య ఢిల్లీ ఎన్నికల సందర్భంగా కూడా కిరణ్ బేడీని ముందుకు తీసుకొచ్చింది బీజేపీ. ఢిల్లీలో గెలిస్తే సీఎం అభ్యర్ధిగా ఆమె పేరు ప్రకటించింది. కానీ.. ఢిల్లీలో ఓడిపోయింది బీజేపీ. ఇప్పుడు కేరళలో సీఎం అభ్యర్ధిని ప్రకటించడంలో అర్దముంది.. అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి. కానీ.. తిరుపతి ఉప ఎన్నికల్లోనే 2024తోపాటు 2029లో కూడా తమ ఉమ్మడి సీఎం అభ్యర్ధి పవనే అంటూ ప్రకటించేసింది.
ప్రస్తుత ఎన్నికల్లో లబ్ది పొందేందుకు.. ఇటివలి తెలంగాణలో బీజేపీతో జనసేన తెగదెంపులు.. ఏపీలో పరిస్థితిపై జనసైనికులు, ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించేందుకే ఈ ప్రకటన చేశారని సుస్పష్టం. అయితే.. బీజేపీ ఇలా ముందుగా సీఎం అభ్యర్ధిని ప్రకటించిన ప్రతి చోటా బీజేపీకి అంతగా పట్టులేని ప్రాంతాలే. ఇప్పుడ పవన్ ను కూడా ఇదే రకంగా తమ లబ్ది కోసం ఉపయోగిస్తోందని చెప్పాలి. ఇప్పుడు తిరుపతిలో బీజేపీ-జనసేన కూటమి గెలిస్తే వీరి పొత్తు కొనసాగే అవకాశాలు ఉంటాయి. అదే.. ఇక్కడ బీజేపీ ఓడిపోతే పరిస్థితేంటనేదే ప్రశ్న. నాయకుడికో రకంగా వ్యాఖ్యలు చేస్తుంటే పవన్ ఎలా తీసుకుంటారో కూడా చూడాల్సిందే..!