2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన బీజేపీ.. రాజకీయంగా తనకు ప్రత్యర్ధులు లేకుండా చేసుకుంటోంది. హిందూ సెంటిమెంట్, రాష్ట్రాల బాగోగుల్ని చూసుకుంటూ.. వారి పనులు కూడా చేసుకుంటున్నారు. దేశంలో సంచలనాలుగా ఉండిపోయిన ఎన్నో అంశాలను ఒక్కోటిగా పరిష్కరిస్తూ విజయం వైపు దూసుకెళ్తోంది. నేడు అయోధ్యలో రామమందిరం నిర్మాణం బీజేపీకి మూడున్నర దశాబ్దాల కల. మొత్తానికి కోర్టులో పరిష్కారం లభించడంతో ఆ కల నెరవేరింది. ఇదే ఆయుధంగా 2024 ఎన్నికలకు బీజేపీ వెళ్తుందనడంలో సందేహం లేదు.
ఒక్కో సమస్య ఇలా..
జమ్ము కశ్మీర్ లో దశాబ్దాలుగా నెరవేరకుండా ఉండిపోయింది ఆర్టికల్ 370 రద్దు అంశం. శతాబ్దాల అంశం, దశాబ్దాల వివాదం.. రామమందిర నిర్మాణం. ఈ రెండు అంశాలు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పరిష్కారమయ్యాయి. 2019లో తిరిగి అధికారం చేపట్టిన తర్వాత ఈ అంశాలపై దృష్టి పెట్టారు మోదీ. ఎటువంటి వివాదం లేకుండా సమస్యలు పరిష్కారం కావడం నిజంగా అద్భుతమే. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయాల్లో సంకీర్ణ ప్రభుత్వం కారణంగా ముందుకు వెళ్లలేకపోయింది. కానీ.. ఇప్పుడు ఏకచత్రాధిపత్యం. దీంతో సమస్యలను పరిష్కరించేందుకు జాగ్రత్తగా అడుగులు వేసి ప్రజలకు ఆమోదయోగ్యమైన ఫలితాలు రాబట్టారు.
గతంలో మోదీ.. ఆదిత్యనాధ్..
వీరిద్దరికీ హిందూత్వ వాదులుగా పేరు. నేడు రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన వీరి చేతుల మీదుగా జరగడం విశేషం. 1984లో సాధు, హిందూ ఆర్గనైజేషన్లకు ఆదిత్యనాధ్ నేతృత్వం వహించారు. దివంగత మహంత్ ఆదిత్యనాధ్ కు శిష్యుడిగా ఉన్నారు. మోదీ.. 1992లో అద్వానీ రథయాత్ర ప్రారంభించిన సమయంలో బీజేపీ నేషనల్ ఆఫీస్ లో ఉండేవారు. కింది స్థాయిల నుంచి ఈ సమస్యను చూసారు. 1992లో కర సేవకులు బాబ్రీ మసీదును కూల్చేయడం చూశారు. వీరిద్దరూ అంచెలంచెలుగా ఎదిగి నేడు ఉన్నతస్థానాల్లో రామమందిరానికి శంకుస్థాపన చేయడం విశేషం.