హైదరాబాద్లో జరుగుతున్న ఎన్నికలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో , ఎత్తులు పై ఎత్తులకు కేంద్రంగా మారుతోంది. ఇదే సమయంలో రెండు ప్రధాన పార్టీల మధ్య వ్యూహాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ టార్గెట్గా బీజేపీ రెండు వ్యూహాలు అమలు చేస్తోందని చెప్తున్నారు.
టార్గెట్ కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ లక్ష్యంగా ఓ వైపు చేరికలు మరోవైపు ప్రచార వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతుందంటున్నారు. తాజాగా టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ బీజేపీలో చేరారు. ఉద్యోగ సంఘాల నేతగా, తెలంగాణ ఉద్యమనేతగా టీఆర్ఎస్ లో చురుకైన పాత్రపోషించిన స్వామీగౌడ్ కేంద్ర బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా ఆధ్వర్యంలో కమలం కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ కు నమ్మిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్న స్వామీగౌడ్ గత కొద్దిరోజులుగా గులాబీ దళంపై గుర్రుగా ఉన్నారు. కేసీఆర్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన స్వామిగౌడ్..తాజాగా బీజేపీ జాతీయ నేతల సమక్షంలో కమలం కండువా కప్పుకోవడం గమనార్హం.
ఢిల్లీ నేతల ప్రచార హోరు
మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కోరిక మేరకు జాతీయ నేతలు ప్రచారంలో భాగస్వామ్యం కానున్నారు. ఈ నెల 27న ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ పార్లమెంట్, చేవెళ్లలో రోడ్ షోలో పాల్గొంటారు. 28న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మల్కాజ్గిరి రోడ్ షోలో పాల్గొంటారు. 29న సికింద్రాబాద్లో రోడ్ షోలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారు. వీరితోపాటు సాద్వి నిరంజన్ జ్యోతి ప్రచారంలో పాల్గొంటారు.
టీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత
మరోవైపు స్థానిక నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ అన్నారు. ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు కొల్లగొట్టాలని టీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా గ్రేటర్ బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేస్తామన్నారు. వరద, బురద రానటువంటి హైదరాబాద్ను నిర్మాణం చేస్తామని, దీనికి సంబంధించిన వివరాలను మ్యానిఫెస్టోలో చేర్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. డబుల్ బెడ్రూం, వరద సాయం, కోవిడ్తోపాటు అన్ని విషయాల్లో వాస్తవాలను ప్రజలకు చేరవేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నిజానిజాలను విన్న ప్రజల్లో టీఆర్ఎప్ పై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు.