MIM : హైదరాబాద్ పాతబస్తీలో లోని అధికార పక్షంగా మజ్లిస్ పార్టీ ఎప్పటి నుండో ఫిక్సయిపోయింది. హైదరాబాద్ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అంతా వారి ఆధిపత్యమే. మైనారిటీలు ఎక్కువగా ఉండే చోట ఓవైసీ బ్రదర్స్ ను ఎదుర్కొనే నేతలు ఇతర పార్టీల్లో లేరనే చెప్పాలి. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫిరోజ్ ఖాన్ తో మిగిలిన వారితో పోలిస్తే ఎంతో ధైర్యంగా వారికి ఎదురు నిలుస్తాడు.
నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పట్టువదలని విక్రమార్కుడు గా పోటీ చేస్తున్న అతను ఎప్పటికైనా ఓవైసీ బ్రదర్స్ పతనం చూడడమే తన లక్ష్యంగా చెబుతారు. ఫిరోజ్ ఖాన్ ప్రతిసారి ఓవైసీ బ్రదర్స్ కు సవాలు విసురుతూ ఉంటారు. ఇక వారి ఆధిపత్యానికి ముప్పు తెచ్చేలా వారికి తలనొప్పులు పుట్టించేలా అతని వ్యాఖ్యలు ఉంటాయి. ఈ విషయంలో ఫిరోజ్ ఖాన్ ను మించిన వారు లేరు అనే చెప్పాలి. దీంతో టిఆర్ఎస్ అనుబంధ పార్టీ అయిన ఎంఐఎం కు దీటుగా ఫిరోజ్ ఖాన్ ను బీజేపీ లోకి తెచ్చే ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
మొట్టమొదటిసారి ఫిరోజ్ ఖాన్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నుండి బరిలోకి దిగారు. ఆ తర్వాత కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఓవైసీల ఆధిపత్యాన్ని ధన బలంతో, కండ బలంతో సమర్థవంతంగా ఎదుర్కొనే ఫిరోజ్ ఖాన్ కు సరైన అండ ఉంటే బ్రదర్స్ కు చుక్కాలు చూపించడం ఖాయం అనే మాట ఎప్పుడూ వినిపిస్తుంటుంది. అటువంటి ఫైర్ బ్రాండ్ లీడర్ భారతీయ జనతా పార్టీలోకి తీసుకు వస్తే ఎంతో ఆసక్తికరమైన సమీకరణలు చోటు చేసుకుంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే ఇక్కడొక చిక్కు ఉంది. బిజెపి అంటేనే మైనారిటీలు నమ్మలేని పరిస్థితి. అయితే ప్రజలతో మమేకం అయ్యే ఫిరోజ్ లాంటి నేతను తీసుకొని వస్తే తమ పార్టీ ఇమేజ్ కూడా మారుతుందని ఇంకా మంచి మేలు జరుగుతుందని భావిస్తున్న బీజేపీ నేతల్లో రాజాసింగ్ ఒకరు. ఖాన్ పార్టీ మారేందుకు కూడా మానసికంగా తయారైనట్లే చెబుతున్నారు. ఇప్పటికే తను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండుసార్లు భేటీ అయినట్లు చెప్పారు. దీంతో బిజెపిలో ఫిరో ఖాన్ ఎంట్రీ ఇస్తే ఓవైసీ బ్రదర్స్ కు కొత్త చిక్కులు మొదలైనట్లే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.