BJP : పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి ఉత్తమ అధికారిగా పేరు ఉంది.పోలీసు శాఖలో ఆమెకంటూ ఒక పేజీ ఉంది .విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమాకు ప్రేరణ కిరణ్ బేడీయే. అయితే ఆమె రాజకీయ రంగంలో మాత్రం రాణించలేకపోయారు. బీజేపీ పెద్దలు అప్పగించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యారు.
దీంతో ఆమె పదవిని కోల్పోయారు. ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి చేసే తప్పులను ఎత్తి చూపాలని ఆమెకు ఆదేశాలు ఉండగా, ఆమె రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుని, నారాయణ స్వామికి ప్రజల్లో సానుభూతి పెరిగేలా చేశారని బీజేపీ పెద్దలు భావించినట్లు తెలుస్తోంది.అందుకే ఆమెను పక్కకు తప్పించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.నిజానికి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడీని తప్పించాలని ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి దాదాపు ఐదేళ్ల నుంచి పోరాడుతున్నారు. నిరసన ప్రదర్శనలు, రాష్ట్రపతితో భేటీ వంటివి నిర్వహించారు. ఎట్టకేలకు ఆమెను ఆమెను ఈ పదవి నుంచి కేంద్ర ప్రభుత్వం సోమవారం తొలగించింది. కానీ సీఎం నారాయణస్వామి కోరికమీద ఆమెను తప్పించలేదని ,దీని వెనుక కారణాలు వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది.
BJP : బీజేపీ లెక్కలు వేరు!
కిరణ్ బేడీ రాజకీయ నేత కాకపోవడం ఆమెకు అతి పెద్ద మైనస్ పాయింట్ అయిందంటారు పుదుచ్చేరి శాసన సభకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. దక్షిణాదిలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ పార్టీ కార్యక్రమాలను, వ్యూహాలను పక్కాగా అమలు చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ పదవిలో ఓ రాజకీయవేత్తను నియమించాలని బీజేపీ భావిస్తోంది. తగినంత మెజారిటీ రాకపోతే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే వ్యక్తిని ఎంపిక చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.కిరణ్ బేడీ అయితే ఈ పని చేయలేదని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు భోగట్టా.
మిత్రపక్షాన్ని మెప్పించడం కోసమా?
ఇక మిత్ర పక్షాల ఒత్తిడి కూడా కిరణ్ బేడీ పదవీచ్యుతికి కారణమని సమాచారం రానున్న ఎన్నికల కోసం మాజీ ముఖ్యమంత్రి ఎన్ రంగ స్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే చర్చలకు ముందే కిరణ్ బేడీకి ఉద్వాసన పలకాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. దీంతో ఇది కూడా కిరణ్ బేడీ పదవి పోవడానికి ఒక కారణం అని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.
అసలు కారణం ఇదే!
అన్నింటికి మించి బీజేపీ పెద్దలు నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో విఫలమవడం వారికి ఆగ్రహం తెప్పిచ్చిందంటారు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తేవాలని కిరణ్ బేడీకి పదవిని అప్పగించినపుడు బీజేపీ పెద్దలు నిర్దేశించినట్లు సమాచారం. అయితే ఆమె ఆ పనిని పక్కన పెట్టి, ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడమే తన లక్ష్యం అన్నట్లు పని చేశారు. దీంతో ముఖ్యమంత్రి నారాయణ స్వామి పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడిందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఇదిలావుండగా, లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడీని తొలగిస్తూ, ఎన్నికల ముందు తీసుకున్న చర్య కేవలం బీజేపీ స్వీయ ప్రయోజనాల కోసమేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.