దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగియడంతో పోలింగ్ సరళి ఆధారంగా రాజకీయ పార్టీల నాయకులు ఎవరికి వారు వారికి అనుకూలంగా అంచనాలు వేసుకుంటున్నారు. రెండు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసినా అవి పూర్తి భిన్నంగా ఉండటంతో ఏది నమ్మాలి, దేనికి విశ్వసనీయత ఉందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణకు చెందిన థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి 51 నుండి 54 శాతం ఓట్లతో విజయం సాధిస్తారనీ, బీజెపి 33 నుండి 36 శాతం ఓట్లతో రెండవ స్థానంలో ఉంటుందని తెలిపింది.
పోలింగ్ సరళి ప్రకారం చూస్తే బిజెపికి బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు కి నలభై ఏడు శాతం ఓట్లు రాగలవని అధికార టీఆర్ఎస్ ముప్పై ఎనిమిది శాతం ఓట్లను మాత్రమే దక్కించుకోగలదని హైదరాబాదుకు చెందిన పొలిటికల్ ల్యాబరేటరీ అనే డిజిటల్ సంస్థ తెలిపింది.కాంగ్రెస్ పార్టీ పదమూడు శాతం ఓట్లతో మూడో స్థానంలోనే ఉంటుందని ఇతరులకు రెండు శాతం ఓట్లు వస్తాయని ఆ సర్వే పేర్కొంది. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని దుబ్బాక, చేగుంట,మిరుదొడ్డి, తోగుట ,నార్సింగి మండలాల్లో బీజేపీ మెజారిటీ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ లో తేలిందట.రాయ్ పాల్ ,దౌలతాబాద్ మండలాల్లో మాత్రం టీఆర్ఎస్కు మెజారిటీ వస్తుందని ఆ సర్వే పేర్కొంది.
అయితే తోగుట మండలంలో టీఆర్ఎస్ మూడో స్థానంలో ఉంటుందని కాంగ్రెస్ కు రెండో స్థానం లభిస్తుందని ఈ సర్వే వెల్లడించడం విశేషం.టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలి రెడ్డిరామచంద్రారెడ్డి మృతితో ఈ ఉప ఎన్నిక జరగనుండగా ఆయన భార్యకి టీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చింది.బీజేపీ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన రఘునందన్రావు మళ్లీ బరిలోకి దిగారు.టిఆర్ఎస్ నుండి ఆఖరి నిమిషంలో వలస వచ్చిన చెరుకు శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్ లభించింది.అయితే మొదటి నుండి కూడా దుబ్బాకలో టీఆర్ఎస్ బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని రాజకీయ పరిశీలకులు సైతం అంచనా వేశారు.దుబ్బాక ను ఎప్పటినుంచో తన స్థావరంగా మార్చుకొని రఘునందన్రావు బాగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారంటారు.
టీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల్లో బీజేపీనే టార్గెట్ చేసింది ఒక్క రఘునందన్ రావు కు మాత్రమే సంబంధించిన రెండు కోట్ల రూపాయలను స్వాధీనపర్చుకునే వరకు పరిస్థితి వెళ్లింది.దుబ్బాకలో బీజేపీ నేతల ప్రచారానికి కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ అడ్డంకులు సృష్టించింది.ఇక టీఆర్ఎస్ తరపున ట్రబుల్ షూటర్ హరీష్ రావు బాధ్యతనంతా తన భుజ స్కంధాల మీద వేసుకుని పార్టీని ఒడ్డెక్కించే ప్రయత్నాలు సాగించారు.ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఎన్నికల ప్రచారం చివరి రోజు దుబ్బాకలో అనేక హామీలిచ్చి వచ్చారు .అయినప్పటికీ ఓటరు నాడి బీజేపీకే అనుకూలంగా ఉందని అధికార పార్టీకి షాక్ తప్పదని ఆ ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది.అయితే అసలు ఫలితం కోసం ఈ నెల పదో తేదీ వరకు వేచిచూడాల్సిందే.