హైదరాబాదు, జనవరి 18: కాప్రాలోని ఒక ఇంట్లో నేడు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల భవనం మొదటి అంతస్తు పూర్తిగా దెబ్బతింది. సమీపంలోని ఇళ్ల కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుపుతున్నారు.
మోహన్లాల్ అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలెండర్ల రీ ఫిల్లింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పేలుడుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.