ప్రముఖ ఆభరణాల సంస్థ తనిష్క్ ఏ అడ్వర్టైజ్మెంట్ విడుదల చేసినా అది వివాదాస్పదం కావడం దాన్ని వెనక్కు తీసుకోవడం పరిపాటిగా మారింది.ఒక్క తనిష్క్ విషయంలోనే ఎందుకిలా జరుగుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్.
కొద్ది రోజుల క్రితం అ సంస్థ మతసామరస్యాన్ని బోధిస్తూ ఒక ప్రకటన విడుదల చేయగా అది నెటిజన్ల ఆగ్రహానికి గురికావడం తెలిసిందే.ఒక హిందూ కోడలు ముస్లిం కుటుంబం లో ప్రవేశించినప్పుడు ఆమెను ఆ కుటుంబం స్వాగతిస్తున్నట్లు ఆ ప్రకటన వెలువడింది.నిజానికి ప్రకటన ఉద్దేశం మంచిదే.రెండు మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో దీన్ని ఆ సంస్థ డిజైన్ చేసి ఉండొచ్చు.కానీ ఎందుకో ఇది హిందూవాదులకు నచ్చలేదు.దీనిపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారు.లవ్ జిహాద్ ని ఈ ప్రకటనల ద్వారా తనీష్కు సంస్థ ప్రమోట్ చేస్తోందని వారు మండిపడ్డారు. ట్విట్టర్ లో అయితే ‘బాయ్ కాట్ తనిష్క్’ పేరుతో హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేశారు.
వివాదం ముదరడంతో ఆ సంస్థ ఆ ప్రకటనను వెనక్కు తీసుకుంది.తాజాగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అదే సంస్థ మరో ప్రకటన విడుదల చేసింది.దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చరాదని.. కేవలం దీపాలు వెలిగించి పండుగ జరుపుకోవాలని తనిష్క్ తన యాడ్ లో చూపించింది. ఈ దీపావళి యాడ్ కూడా వివాదాస్పదమైంది. అందరికంటే ముందు కర్ణాటకకి చెందిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రవి ఈ ప్రకటనపై స్పందించారు. హిందువుల పండుగలను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే విషయాన్ని ఎందుకు చెబుతారు.
ఒక వర్గం సంస్కృతి సంప్రదాయాలపై లెక్చర్లు ఇవ్వకూడదని.. మీకేంటి నొప్పి.. దీపావళికి దీపాలు వెలిగిస్తాం.. స్వీట్లు పంచుతాం.. బాణాసంచా కాలుస్తాం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.వెంటనే ఇతర నెటిజన్లు కూడా అంది పుచ్చుకొని ఆ సంస్థను తీవ్రంగా ట్రోల్ చేయడం మొదలెట్టారు.మళ్లీ ‘బాయ్ కాట్ తనిష్క’అనేంత వరకు పరిస్థితి వెళ్లింది. దీంతో అప్రమత్తమైన ఆ సంస్థ వెంటనే ఈ దీపావళి ప్రకటనను కూడా ఉపసంహరించుకుంది.అయినప్పటికీ నెటిజన్ల ఆగ్రహ జ్వాలలు ఇంకా చల్లారలేదు.కాగా తమ పోటీ సంస్థలు ఈ విధంగా నెటిజన్లను రెచ్చగొట్టి తమ పైకి వదులుతున్నారని తనిష్క సంస్థ భావిస్తోందని సమాచారం.ఇప్పటికైతే ఇంకా ఈ వివాదం పూర్తిగా సద్దుమణగలేదు.ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.