రాజమండ్రి: కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటు వెలికితీత పనులు ప్రారంభమయ్యయి. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ యజమాని ధర్మాడి సత్యం ఆధ్వర్యంలో బోటు వెలికితీసేందుకు 25మంది మత్స్యకారులు ప్రయత్నాలు ప్రారంభించారు. గోదావరిలో నాలుగు లంగర్లు వేసి ఐరెన్ రోప్ను జెసిబికి కట్టి మత్స్యకారులు లాగుతున్నారు. 210 అడుగుల లోతులో బోటు ఉన్నట్లు ధర్మాడి సత్యం అనుమానం వ్యక్తం చేశారు.
బోటు ప్రమాదంలో ఇంకా 16మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. బోటు వెలికితీత పనుల నేపథ్యంలో కచ్చలూరు సమీపంలో పోలీసులు ఆంక్షలు విధించారు.
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం జరిగి నేటికి 16 రోజులు అయింది. బోటును వెలికి తీయాలని అన్ని రాజకీయ పార్టీలు, మృతుల కుటుంబాల డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం బోటు వెలికి తీసే పనులను కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థకు అనుమతి ఇచ్చింది. దీని కోసం 27.70లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.