అమెరికాలోని ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండగ క్రిస్మస్.. బంధువులతో సరదా సరదాగా బహుమతులు పంచుకుంటూ, కేక్ పుడ్డింగ్ లు చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారు. ఇలా ఈ సంవత్సరం అందరూ క్రిస్మస్ సంబరాల్లో సంతోషంగా ఉండగా విషాదం నెలకొంది. దేశమంతా క్రిస్మస్ పండుగ మూడ్ లో ఉండగా ఒక్కసారిగా అగ్రరాజ్యం ఉలిక్కిపడింది.
అమెరికా లోని టెన్నెసీ లో నాష్ విల్లే నగరంలోని ఓ ప్రాంతంలో పార్క్ చేసి ఉంచిన వాహనంలో దుండగులు బాంబుని అమర్చారు. ఆ బాంబు పేలడంతో అక్కడి ప్రజలు హడలిపోయారు. వెంటనే అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో బార్లు రెస్టారెంట్లు అధికంగా ఉంటాయని ఆ ప్రదేశాన్ని వారు టార్గెట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆ ప్రదేశంలో శరీర అవశేషాలు కనిపించగా పోలీసులు విచారించారు. ఆ శరీర భాగాలు పేలుడుకు కారణమైన దుండగుడివే కావచ్చని లేదా ఆ ప్రాంతంలో ఎవరైనా అయ్యి ఉండాలని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఆ బాంబు పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు మరియు కార్లు ధ్వంసమయ్యాయి. పేలుడు ఉదయం జరగడంతో పెద్దగా జననష్టం జరగలేదని పెను ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. కొన్ని మానవ శరీరాల అవశేషాలు అక్కడ పడి ఉండడాన్ని చుసిన పోలీసులు పేలుడు ధాటికి ఖచ్చితంగా కొందరు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే వారు ఎవరన్నది ఇంకా గుర్తించలేకపోతున్నారు.
బాంబు పేలే ముందు దుండగులు మరో 15 నిమిషాలలో ఈ ప్రాంతంలో బాంబు పేలే ప్రమాదం ఉందని ఆడియో రికార్డ్ చేసి పోలీసులకు పంపించడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలోని భవనాలు ఇళ్ల నుంచి అందరినీ ఖాళీ చేయించారు. ఈ విధంగా పోలీసులు పెను ప్రమాదాన్ని తప్పించగలిగారు.