అతను ఒక సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. విద్యాధికుడు. క్షణికావేశంలో చేసిన ఓ వెర్రి పనితో అడ్డంగా బుక్ అయ్యాడు. కటకటాల పాలు అయ్యాడు. విషయంలోకి వెళితే.. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. హైదరాబాద్ – చెన్నై ఇండిగో విమానంలో బాంబ్ పెట్టామంటూ ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. దీంతో విమానాశ్రయంలో కలకలం రేగింది. ఎయిర్ పోర్టు సిబ్బంది అలెర్ట్ అయ్యారు. సీఐఎస్ఎఫ్, ఇంటెలిజెన్స్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో ఎయిర్ పోర్టులో, సదరు విమానంలో క్షణ్ణంగా తనిఖీలు చేశారు. ఎలాంటి బాంబ్ లేదని నిర్దారణ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఇదే క్రమంలో ఈ ఫేక్ కాల్ ఎక్కడ నుండి వచ్చింది అనే విషయాన్ని అధికారులు ట్రేస్ చేశారు. బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తి ఎయిర్ పోర్టులోనే ఉన్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అధికారులకు అతను చెప్పిన సమాధానంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. అతని పేరు అజ్మీరా భద్రయ్య అని, అతను చెన్నై లో సీనియర్ ఇంజనీర్ గా పని చేస్తున్నట్లుగా చెప్పారు. చెన్నై వెళ్లేందుకు అతను ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అయితే ఆతను ఆలస్యంగా రావడంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది లోపలకు అనుమతించలేదు.
దీంతో కోపంతో ఊగిపోయిన అతను, పక్కకు వెళ్లి బెదిరింపు కాల్ చేసినట్లుగా గుర్తించారు. ఈ విషయం తెలిసీ అధికారులు, ప్రయాణీకులు అవాక్కయ్యారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సీనియర్ ఇంజనీర్ అయి ఉండి, ఫేక్ కాల్ చేస్తే ఎలాగైనా పట్టుకుంటారని తెలిసి కూడా అలా ఎందుకు చేశాడోనని ప్రయాణీకులు అతని అతి తెలివితేటలను తప్పుబడుతున్నారు. చదవేస్తే ఉన్న మతి పోయింది అన్న సామెత ఇలాంటి వారికి వర్తిస్తుంది.
టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరుల దాడి ..గన్నవరంలో హైటెన్షన్
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?