విశాఖపట్టణంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిర్ణయం తీసుకోగా, వివిధ కోర్టు కేసుల కారణంగా ఆ నిర్ణయం ప్రస్తుతానికి ఆగిపోయింది.
అయితే, ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై వైసీపీని టార్గెట్ చేసేలా తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తోంది. అయితే, ఇదే ఒరవడిలో తాజాగా మరో సంచలన విమర్శ చేసింది. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అంతా విజయసాయిరెడ్డి ద్వారానే
ఉత్తరాంధ్రలో మంత్రులను పక్కనపెట్టి, విజయసాయిరెడ్డే సర్వం తానై వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖ మహానగరపాలక సంస్థ పరిధిలో ఉన్నవారికి ఇళ్ల పట్టాలుఇవ్వాలని 1400 ఎకరాలు సేకరించారు. ఆ భూమి మొత్తం కొండలు, గుట్టలు, లోతట్టుప్రాంతాల్లోనే ఉంది. సదరుభూమి చదునుకోసం రూ.23కోట్లను ప్రభుత్వం మంజూరుచేస్తే, ఆ సొమ్ముతో చేసే పనులకు ఎటువంటి టెండర్లు పిలవకుండా, మంత్రులు బొత్స, అవంతి, ఎంపీ విజయసాయిరెడ్డి తమ వాళ్లకు పనులను కట్టబెట్టారు. ఎటువంటి నిబంధనలు పాటించకుండా, రూ.23కోట్ల పనులను తమ అనుమాయులకు కట్టబెట్టేసి, ఏవిధమైన పనులు చేయకుండానే, ఆ సొమ్మంతా కాజేశారు. రూ.23కోట్లకు సంబంధించిన పనుల వ్యవహారంపై, నిధులు డ్రాచేయడంపై తక్షణమే ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఏ విచారణ జరిపిస్తారో జరిపించి నిజాలు బయటపెట్టాలి. “ అని డిమాండ్ చేశారు. విశాఖ కేంద్రంగా విజయసాయిరెడ్డి సుమారు 6 నుంచి 7వేల ఎకరాల వరకు దోపిడీ చేశారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. “భూ ఆక్రమణలపై తూతూ మంత్రంగా సిట్ వేసిన ప్రభుత్వం, దానికి సంబంధించిన నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదు?` అని ప్రశ్నించారు.
బొత్స రిప్లై మామూలుగా లేదుగా
అయితే, ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ టీడీపీ విమర్శలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. విశాఖలో జరిగిన ల్యాండ్ స్కాంలపై ఇప్పటికే సిట్ విచారణ జరుపుతోందని వెల్లడించారు.“గత ప్రభుత్వం సిట్ విచారణను మూలన పెడితే.. ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని పునర్ నిర్వచించాం. నిర్దిష్ట సమయం ఇచ్చి విచారణ పూర్తి చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. సిట్ కాల పరిమితి ఇక పెంచకుండా దర్యాప్తు పూర్తి చేయాలని చెప్పారు. మేం ఎటువంటి తప్పులు చేయలేదు కాబట్టే, ధైర్యంగా ఉన్నాం. విచారణ జరిపిస్తున్నాం. తెలుగుదేశం హయాంలో ఎప్పుడైనా ఏ దర్యాప్తు అయినా పూర్తి చేశారా..? దోషులపై చర్యలు తీసుకున్నారా..? నాడు ప్రతిదీ ప్రతిపక్షంగా ఉన్న వైయస్ఆర్సీపీపై ఆరోపణలు మోపి.. దర్యాప్తులు వేసి, చివరికి వాళ్ళే దోషులుగా తేలేటప్పటికీ విచారణలు నిలిపివేశారు“ అంటూ విరుచుకుపడ్డారు.
విశాఖ కోసం ఏం చేస్తున్నామంటే…
పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖ నగర అభివృద్ధికోసం అన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నామని మంత్రి బొత్స వెల్లడించారు. “విశాఖపట్నంలో కొత్తగా నిర్మించాల్సిన ప్రాజెక్టులను పరిశీలిస్తున్నాం. భోగాపురం ఎయిర్ పోర్టుకు సంబంధించి ఓ ఏజెన్సీకి 2500 ఎకరాలు గత ప్రభుత్వ హయాంలో అప్పగించాలని చూస్తే.. అందులో 500 ఎకరాలు తగ్గించి, ఆ భూముల్లో ఎస్ఈజెడ్ ఏర్పాటు చేసి, ఉపాధి అవకాశాలు పెంచాలని ఈ ప్రభుత్వం చూస్తుంది. దీర్ఘకాలికమైన ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్పితే, టీడీపీ హయాంలో జరిగినట్టు ఎటువంటి దొంగ బుద్ధి లేదు. “ అంటూ మండిపడ్డారు.