పోతిరెడ్డిపాడుకి అనుమతులు లేవ్..! అపెక్స్ అనుమతి, డీపీఆర్ ఉన్నాయా..? మీరు కడితే మేము ఊరుకోమ్ : కేసీఆర్ ..!!
మీ కాళేశ్వరం ప్రాజెక్టుకి అనుమతులు ఉన్నాయా..? మాకో న్యాయం, మీకో న్యాయమా..? మేము కట్టుకుంటాం : జగన్ .!!
(గమనిక ఇవి నిన్న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా మాత్రమే..!)
రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి సహకరిస్తా. సీమకు నీళ్లు ఇవ్వడానికి పెద్దన్న పాత్రలో ఉంటా : కేసీఆర్ (2019 ఆగష్టు 12 న తిరుమల వచ్చి.., రోజా ఇంట్లో భోజనం చేసిన తర్వాత కేసీఆర్ చెప్పిన మాటలు)
కేసీఆర్ అంటే మాటల మాంత్రికుడు. నాడు మాటల ద్వారా తన ప్రేమ చాటారు. జగన్ అలా కాదు. చేతల ద్వారా తన ప్రేమని చాటారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ కి వెళ్లి, రిబ్బను కట్ చేసి, కొబ్బరికాయ కొట్టి వచ్చారు.
ఏదో జరిగింది..! ఈ సీఎంలకు ఏదో జరిగింది. ..!!
సీఎంలు మాటలు మార్చడం సహజమే. ఓట్ల కోసమో.., రాజకీయం కోసమో.. నేతలు మాటలు మారుస్తూ ఉండడం మనం చూస్తుంటాం. తెలుగునాట అందులో బాగా ఆరితేరిన నాయకుడు చంద్రబాబు, ఆ తర్వాత కేసీఆర్, పవన్ కళ్యాణ్, జగన్ కూడా చేరతారు. కానీ స్నేహం కోసం, మెప్పు కోసం నాడు ఒకరి భజన ఒకరు చేసుకుని.. ఇప్పుడు స్నేహం చెడగానే ఒకరినొకరు కత్తులు దూసుకుంటూ మాటలు మారుస్తుంటే ఇక్కడ నష్టం ఎవరికీ..? నమ్మకం చెదిరింది ఎవరికీ..? అసలు ఈ ఇద్దరికీ ఏం జరిగింది..? ఈ ఇద్దరి మధ్య అగాధం కారణం ఏంటి..? లేకపోతే నాడు “పెద్దన్నగా సహకరిస్తా అన్న కేసీఆర్ ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడతారు. అప్పుడు కాళేశ్వరం ఓపెనింగ్ కి వెళ్లిన జగన్ ఎందుకు ఇప్పుడు దాన్ని తప్పు పడతారు..?
అడ్డంగా బుక్కయినట్టేనా..!?
జగన్ – కేసీఆర్ మధ్య 2018 వరకు పెద్దగా స్నేహం లేదు. అంతగా విరోధం లేదు. కేసీఆర్ అసలు ఏపీని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు వెళ్లి తెలంగాణాలో కేసీఆర్ ని కెలికి, తిట్టి వచ్చాడో.. అక్కడితో కేసీఆర్ కి జగన్ మిత్రుడయ్యారు. తన శత్రువు(చంద్రబాబు)కి శత్రువు(జగన్) తో స్నేహం చేసి చంద్రబాబుని దెబ్బకొట్టాలి అనుకున్నారు. అందుకే జగన్ కి పూర్తిగా సహకరించారు. అలా పరిపాలనలో కూడా ఇద్దరూ ఒకరినొకరు సహకరించుకోవాలి అనుకున్నారు. అంటే రాజకీయ బంధం కాస్త పాలన బంధంగా మారింది. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని వివాదాలు పరిష్కారమైనట్టేనని అందరూ భావించారు.
* ఫెడరల్ ఫ్రంట్ లో తనతో కలిసి జగన్ వస్తాడు అనుకుని కేసీఆర్ జగన్ తో మాంచి స్నేహం చేసారు. అంటే కేవలం భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ ఇద్దరూ పాముల్లా ప్రేమించుకున్నారు. కానీ జగన్ బీజేపీకి దగ్గరగా వెళ్తుండడం కేసీఆర్ కి కునుకు లేకుండా చేస్తుంది. బీజేపీని కేసీఆర్ బద్ధ శత్రువుగా చూస్తున్న తరుణంలో జగన్ ఇలా వెళ్లడం కేసీఆర్ కి నచ్చడం లేదు. అందుకే మొదట్లో రాయలసీమ ప్రాజెక్టుపై పెద్దగా మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు పగ పట్టారు. సహకరించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఇవేం నమ్మకపోతే.. కేసీఆర్ వైఖరి మారలేదు అనుకుంటే… గత నెల డిసెంబరులోనే పోతిరెడ్డిపాడు విస్తరణ (రాయలసీమ లిఫ్ట్) కి ఆమోదం లభించింది. అప్పుడు కేసీఆర్ ఎందుకు స్పందించలేదు..? అంతకు ముందు “రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి పెద్దన్నలా సహకరిస్తా” అన్నారంటే అర్థమేంటి..? కానీ… ఈ ఏడాది మొదటి నుండి జగన్ బీజేపీకి దగ్గరవుతున్నారు. కేసీఆర్ కి దూరమవుతున్నారు. అందుకే మే నెలలో తీసుకొచ్చిన జీవో 203 (రాయలసీమ లిఫ్ట్) పై కేసీఆర్ తన స్థాయి పోరాటం చేస్తున్నారు. సో… ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే.. రాజకీయం, స్నేహం బాగుంటే లాజిక్కులు, ప్రశ్నలు, అనుమానాలు రావు.. నీళ్లొస్తాయి…!! స్నేహం లేకపోతే, రాజకీయం చెడితే నీళ్లు రావు. లాజిక్కులొస్తాయి.., ప్రశ్నలొస్తాయి.., ముప్పుతిప్పలొస్తాయి..! దట్ ఈజ్ తెలుగు పాలిట్రిక్స్..!!