తిరుమల, డిసెంబర్ 30: శుక్రవారం వేకువజామున తిరుమలలో అదృశ్యమైన 16 నెలల వీరేశ్ ఆచూకీని మహారాష్ట్ర పోలీసులు కనిపెట్టారు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడు లాతూర్ వెళ్లినట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని లాతూరులో నిందితుడితో పాటు బాలుడిని గుర్తించారు.
బాలుడి ఆచూకీ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించారు. కిడ్నాపర్ను తిరుమల పోలీసులు సంఘటనకు ముందు అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు. ఆ సంగతి బయటపడడంతో పోలీసులకు ఈ కేసు మరింత సవాలుగా మారింది. అదుపులోకి తీసుకున్నపుడు పోలీసులు తీసిన ఫొటోతో గాలింపు మొదలు పెట్టారు.
ఈ ఘటనపై పత్రికలు, ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలలో కూడా పెద్దఎత్తున ప్రచారం జరిగింది. బాలుడిని, నిందితుడిని ఆదివారం ఉదయం మహారాష్ట్ర పోలీసులు గుర్తించి, నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆంధ్ర పోలీసులకు సమాచారం చేరవెశారు. నిందితుడిని తీసుకొచ్చేందుకు ఎపి పోలీసులు మహారాష్ట్ర బయల్దేరారు. .