Brahmamgari Matam: కాలజ్ఞాని వీర బ్రహ్మేంద్ర స్వామి మఠం నూతన పీఠాధిపతి నియామక వ్యవహారంలోమఠాధిపతులపై ఫిర్యాదులు, సంచలన ఆరోపణలు చోటుచేసుకున్నాయి.మఠం పీఠాధిపతి నియామకానికి సన్నాహాలు చేస్తున్న మఠాధిపతుల బృందంపైన ఫిర్యాదు చేస్తూ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఒక లేఖ రాసింది.ఈ నేపథ్యంలో విశ్వకర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు,శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి మీడియా సమావేశంలో వీర భోగ వసంత వెంకటేశ్వరస్వామి మరణంపైనే సంచలన ఆరోపణలు చేశారు.దీంతో పీఠాధిపతి నియామకం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
Brahmamgari Matam: వివాదం ఏంటంటే?
ఇటీవల బ్రహ్మంగారి మఠం మఠాధిపతి వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి శివైక్యం చెందారు.నూతన మఠాధిపతిగా మరణించిన వేంకటేశ్వరస్వామి పెద్ద భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని నియమించాలని మఠాధిపతులు నిర్ణయించారు.ఇది మఠంలో అనుసరిస్తున్న సాంప్రదాయమని, వారసత్వానికి ప్రాధాన్యం ఉంటుందని వారు గతంలోనే తేల్చి చెప్పారు.అయితే వేంకటేశ్వరస్వామి రెండో భార్య మహలక్ష్మమ్మ తన కుమారుడిని పీఠాధిపతి చెయ్యాలని వాదిస్తున్నారు. ఈ మేరకు మరణించిన తన భర్త వీలునామా రాశారని ఆమె చెబుతున్నారు.అయితే మఠాధిపతులు ఇందుకు అంగీకరించడం లేదు.ధర్మశాస్త్రం ప్రకారం మఠాధిపతి ఎంపిక విషయంలో తొలి భార్య సంతానానికి వారసత్వం వర్తిస్తుందని,తొలి భార్యకు సంతానం లేనిపక్షంలోనే రెండవ భార్య సంతానానికి అవకాశముంటుందని శివస్వామి తేల్చి చెప్పారు.ఇక్కడ మొదటి భార్యకు సంతానం ఉన్నందున ,రెండో భార్య సంతానానికి అవకాశం ఉండదని, పైగా మఠాధిపతి నియామకానికి వీలునామాలు చెల్లవని ఆయన వివరించారు. మఠాధిపతుల బృందం అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించగా అందరూ కూడా తొలి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామినే పీఠాధిపతిని చేయాలని సూచించారని శివస్వామి తెలిపారు.
రెండో భార్య అభ్యంతరం!డీజీపీకి ఫిర్యాదు
అయితే మఠాధిపతుల ప్రతిపాదనకుకి రెండో భార్య అభ్యతరం తెలిపింది. వీలునామా ప్రకారం తన కుమారుడినే పీఠాధిపతి చెయ్యాలని వాదించింది.కానీ ఇందుకు మఠాధిపతులు అంగీకరించకపోవడంతో ఆమె వారిపైనే ఫిర్యాదులు చేస్తూ డీజీపీకి ఒక లేఖ రాసింది.దీనిపై మండిపడ్డ శివస్వామి పలు సంచలన ఆరోపణలు చేశారు.
మఠాధిపతి మృతిపై శివస్వామి అనుమానాలు!
అసలు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మృతిపైనే తమకు అనుమానాలున్నాయని శివస్వామి చెప్పారు.కుటుంబ పరమైన ఒత్తిళ్ల కారణంగానే ఆయన అనారోగ్యానికి గురై మరణించారని స్థానికులు సైతం చెబుతున్నారన్నారు.అంతేగాక మఠాధిపతి నివాసంలో పనిచేస్తున్న చంద్రావతమ్మ అనే మహిళ ఆయన మరణానంతరం కనిపించకుండా పోయిందని వెల్లడించారు.మఠానికి భక్తులు సమర్పించిన కానుకల విషయంలో కూడా అక్రమాలు జరిగినట్లు,అవి దుర్వినియోగమైనట్లు కూడా ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.వీటన్నిటిపై పోలీసులు తక్షణమే విచారణ చేపట్టాలని శివస్వామి కోరారు. శివస్వామి ఆరోపణలన్నీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి రెండో భార్యను ఉద్దేశించి చేసినవిగానే చెప్పవచ్చు.ఇంకా ఈ వ్యవహారం ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.