పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మానవాళిని కాపాడుతుంది. అందుకే అందరూ మొక్కలు నాటాలంటూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత అద్భుతంగా ముందుకు సాగుతోంది. ఎంతోమంది సెలబ్రిటీలు మొక్కలు నాటి పర్యావరణం ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా యాంకర్, నటి ఉదయభాను చేసిన ఛాలెంజ్ ను హాస్యబ్రహ్మ బ్రహ్మానందం స్వీకరించారు. మణికొండలోని తన నివాసంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం పంచుకున్న విషయాలను ఉదయభాను వివరించారు. ‘సృష్టిని కాపాడేందుకు ఒంటికాలిపై తపస్సు చేస్తోంది చెట్టు మాత్రమే. ఇది నిజం. ప్రకృతి పట్ల అందరూ బాధ్యతగా ఉండాలి’ అని అన్నారని ఉదయభాను గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులకు తెలిపారు. తన ఛాలెంజ్ ను స్వీకరించిన బ్రహ్మానందంకు ఉదయభాను కృతజ్ఞతలు తెలిపారు.