ఏపీలో బీజేపీ నేతలు ఎవరికి వారు అమరావతిపై తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. అయితే అది ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయిన సోము వీర్రాజుకు నచ్చితే పార్టీలో ఉంటారు.
ఆయనకు నచ్చకపోతే సస్పెండ్ చేస్తారనే సెటైర్లు బీజేపీలోనే వినిపిస్తున్నాయి. మంగళవారం జరిగిన సోము వీర్రాజు ప్రమాణ స్వీకారోత్సవ సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. ఏపీ రాజకీయాల బాధ్యత మొత్తం తనదేనని రామ్మాధవ్ మాత్రం జగను ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీ లాంటి రాష్ట్రానికే మూడు రాజధానులు లేవు ..ఏపీకి ఎందుకని ప్రశ్నించారు. అవినీతి కోసమే.. మూడు రాజధానులు పెడుతున్నారని ఆరోపించారు.
ఈ విషయం లో కేంద్రం కల్పించుకోవాలంటే కల్పించుకోగలదని,అయితే హైకోర్టులో అఫిడవిట్ తన పరిధి మేరకే వేసిందని ఆయన హింట్ కూడా ఇచ్చారు. రామ్మాధవ్ ప్రసంగం తీరు బీజేపీ నేతల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అమరావతి కి మద్దతుగా మాట్లాడిన రామ్ మాధవ్ విషయంలో సోము వీర్రాజు మౌనంగా ఉన్నారు. అంతకు ముందు ఇదే సోము వీర్రాజు అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిని,పత్రికలకు వ్యాసాలు రాసిన వారిని, రైతుల దీక్షా శిబిరాలకు వెళ్లిన వారిని సస్పెండ్ చేశారు.ఇప్పటికి ఐదారుగురు నేతల్ని ఆయన ఇంటికి పంపేశారు. దాంతో.. చాలా మంది నేతలు అమరావతి గురించి నోరెత్తడానికి సిద్ధపడటం లేదు.
కానీ రామ్ మాధవ్ మాత్రం అమరావతి కి మద్దతుగా బహిరంగంగానే తమ గళం వినిపించారు. అయితే రామ్ మాధవ్ అలా ఎందుకు స్పందించారు అన్న విషయమై బిజెపిలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. బిజెపి రాజకీయ భాగమని వ్యూహంలో అదో భాగమని, అందుకే ఆయన అమరావతికి మద్దతుగా మాట్లాడారు అంటున్నారు. వైసీపీ ని బిజెపి పూర్తిగా దూరం చేసుకోబోదని, అదే సమయంలో పూర్తిగా వెనకేసుకు కూడా రాదని, అప్పుడప్పుడు బిజెపి నేతలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసి ప్రజల దృష్టిని మళ్ళిస్తుంటారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే అమరావతికి మద్దతిచ్చే వారిని సస్పెండ్ చేసిన సోము వీర్రాజు పరిస్థితి ఏమిటన్నదే బిజెపి లో ఇప్పుడు హాట్ టాపిక్ !