Breaking News: ప్రేమ పేరుతో.. వ్యామోహం పెంచుకుని ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. కత్తితో బెదిరించడం, ఏసిడ్ పోసేయ్యడం, వీరంగం సృష్టించడం వంటి అనేక ఘటనలు చూసాము. తాజాగా చిత్తూరు జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది.. “బాలిక వయసు పదహారేళ్లు.. ఈ కుర్రాడి వయసు పాతిక.. ఆమెని ప్రేమిస్తున్నాడట.. ఆమె తిరిగి ప్రేమించాలట.. లేకపోతే కాల్చి చంపేస్తా అంటూ వెంటపడ్డాడు. చిత్తూరు జిల్లా మారుమూల పల్లెలో ఆ దారుణం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
Breaking News: తరచూ వెంటపడేవాడు…!
చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లె మండలం కడపనత్తం గ్రామం.. గట్టిగా వేయి కుటుంబాలు ఉండవు. అందరూ వ్యవసాయ పనులు, కూలీ చేసుకుని జీవించే కుటుంబాలు. ఈ గ్రామంలో చాన్ అలియాస్ ఖాదర్ బాషా అనే యువకుడు వృత్తిరీత్యా టైలర్. దుస్తులు కుట్టుకుంటూ తల్లిదండ్రులతో కలసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన దగ్గరకు బట్టలు ఇవ్వడానికి వచ్చిన గ్రామానికి చెందిన పదహారేళ్ళ మైనర్ బాలికపై కన్నేశాడు. ప్రేమించానని వెంటపడ్డాడు. ఆమెని విసిగించాడు. రోజూ వెంట తిరుగుతూ ఆమెని ప్రేమించాలంటూ వెంటపడి, అప్పుడప్పుడు బెదిరించేవాడు. ఆమె ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటా అంటూ మధ్యలో బెదిరింపులు చేసేవాడు. ఈ క్రమంలోనే ఆమె లొంగక పోవడంతో గ్రామా సరిహద్దుల్లో కాపలాకాసి ఆమె నడిచి వెళ్తున్నప్పుడు ఈలలు వేయడం, గోల చేయడం, అసభ్యంగా పిలవడం, చేయి పట్టుకుని లాగడం చేసేవాడు. దీంతో విసిగిపోయిన బాలిక వారి కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది.
బెదిరించినా ఆగలేదు..!
కుటుంబ సభ్యులు ఒకటి, రెండు సార్లు హెచ్చరించారు. అయినా యువకుడు మానకపోవడంతో ఊరి పెద్దల్లో పంచాయతీ పెట్టారు. పెద్దలు మాట్లాడుతున్న సమయంలోనే ఇరు కుటుంబాలు గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే బాలిక తల్లి ఆ యువకుడిపై దాడికి దిగింది. గొడవ పెద్దదై.. గ్రామా పెద్దలు ఆపినా ఆగలేదు. ఆ యువకుడిపై బాలిక కుటుంబ సభ్యులు దాడి చేశారు. దీంతో ఇది మనసులో పెట్టుకున్న యువకుడు.. ఈ రోజు ఉదయం బాలిక ఇంటివద్దకు వెళ్లి.., నాటు తుపాకీ తీసుకెళ్లి బెదిరించాడు. బాలిక తల్లిని చంపేస్తా అంటూ తుపాకీ ఎక్కుపెట్టాడు. ఇదే సమయానికి పక్కింటిలో ఉండే దినేష్ అడ్డు వచ్చి, యువకుడిని నిలువరించసాగాడు.. ఆగ్రహానికి గురైన యువకుడు దినేష్ పై కాల్పులు జరిపాడు. తుపాకీ శబ్దం ఊరు మొత్తం మార్మోగింది. దీంతో గ్రామస్థులు అందరూ ఘటనా స్థలం వద్దకు వచ్చి.. యువకుడు చాన్ ని అదుపులోకి తీసుకుని, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకొని.. అతన్ని అరెస్టు చేసి, ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.