Breaking: ప్రముఖ పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా (28) హత్యకు గురైయ్యారు. ఆదివారం మాన్సా జిల్లాలోని జవహర్ కీ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో ఆయనను కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వీఐపీ సంస్కృతిని తెరదించుతూ సిద్దూ మూసేవాలాతో సహా 424 మంది ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన పోలీస్ భద్రతను తొలగించిన మరుసటి రోజే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సిద్దూ మూసేవాలా గత అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లోని మాన్సా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి గా పోటీ చేసి ఆప్ అభ్యర్ధి విజయ్ సింగ్లా చేతిలో పరాజయం పాలైయ్యారు. దాదాపు 63 వేల ఓట్ల తేడాతో సిద్దూ ఓడిపోయాడు. సిద్దూపై గెలిచిన విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను ముఖ్యమంత్రి భగవత్ మాన్ మంత్రి వర్గం నుండి తొలగించడంతో పాటు అరెస్టు చేసి జైలుకు పంపించారు.
వివాదాస్పద సింగర్ గా గతంలో సిద్దూ మూసేవాలా వార్తల్లో నిలిచారు. ఆయన పాడిన బంబిహ బోలే, 47 పాట అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. పలు చిత్రాల్లోనూ సిద్ధూ మూసేవాలా నటించారు. కాగా గాయకుడు సిద్దూ మూసేవాలా మృతికి సంతాపం తెలుపుతూ కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జీవాలా ట్వీట్ చేశారు. పట్టపగలు సిద్దూ మూసేవాలా దారుణ హత్య జరగడం తీవ్ర దిగ్భాంతికి గురి చేసిందన్నారు. గొప్ప పంజాబీ గాయకుడిని కోల్పోయామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు సానుభూతి తెలియజేశారు సుర్జీవాలా.