Breaking: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసును ఏపి బయట వేరే రాష్ట్రంలో విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ పిటిషన్ ను విచారణ జరిపిన సుప్రీం కోర్టు .. వివేకా కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అంగీకారం తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో నిన్న (మంళవారం) సీబీఐ తమ అఫిడవిట్ దాఖలు చేసింది. వివేకా కుమార్తె లేవనెత్తిన అనుమానాన్నీ నిజమేనని సీబీఐ పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుకుంటున్నారని ప్రతివాదులైన ఉమాశంకరరెడ్డి, గంగిరెడ్డి లను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. తన తండ్రి హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరిన సునీతా రెడ్డి తరపు న్యాయవాదులు మాత్రం .. తెలంగాణకు బదిలీ చేసినా ఫరవాలేదని తెలుపగా, సీబీఐ మాత్రం అభ్యంతరం తెలిపింది. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం బదిలీ చేయవద్దని కోర్టును కోరింది. కర్ణాటక కు బదిలీ చేయాలని కోర్టును సీబీఐ అభ్యర్ధించింది. విచారణ జాప్యం విషయంలో సీబీఐ పై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. సునీతారెడ్డి పిటిషన్ లో చేసిన వాదనలను ధర్మాసనం అంగీకరించింది.
ఏపి పోలీసులు, నిందితులు కుమ్మక్కు అవ్వడం వల్లనే విచారణలో జాప్యం అవుతోందని సీబీఐ వెల్లడించింది. కేసు విచారణ అధికారిపైనే నిందితులు కేసులు పెట్టారని సీబీఐ తెలిపింది. మెజిస్ట్రేట్ ముందు 164 స్టేట్ మెంట్ ఇస్తానన్న పోలీస్ అధికారి శంకరయ్య కు ఏపి ప్రభుత్వం పదోన్నతి కల్పించిందనీ, ఆ తర్వాత తనపై సీబీఐ ఒత్తిడి తెచ్చి 164 స్టేట్ మెంట్ అడిగారంటూ శంకరయ్య లేఖ రాశారని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అంశంపై తీర్పును రిజర్వు చేసిన సుప్రీం కోర్టు.. శుక్రవారం తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.