నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణం రాజు తన వ్యాపార ప్రయోజనాలకోసమే కాకుండా తన రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీని కవ్విస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. బ్యాంకులకు రుణాలు ఎగవేసిన వారంతా ఒక్కొక్కరుగా బీజేపీ చెంతకు చేరుతున్నారు. తమ వ్యాపారాలను నిర్వహించుకోవడం కోసం వారు కేంద్రంలో అధికార పార్టీని ఆశ్రయించడం ఆనవాయితీగా మారింది .గతంలో కావూరి సాంబశివరావు, సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసుల్లో ఉన్నారు.
తాజాగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా ఆ ఖాతాలోనే చేరిపోయారు. దీంతో పాటు రఘురామ కృష్ణంరాజు మరిన్ని ప్రయోజనాలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు కేంద్రంలో కీలక పదవి కోసం రఘురామ కృష్ణంరాజు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఇందుకోసం రఘురామకృష్ణంరాజు ద్విముఖ వ్యూహం అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది తన బ్యాంకు రుణాల ఎగవేత కేసు నుంచి తప్పించుకోవడానికే ఆయన వైసీపీ పై విమర్శలు చేస్తున్నారని చెబుతున్నారు. 2018 లోనే బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయి. కేసు నమోదయింది. అదే సమయంలో వైసీపీలోనే కొనసాగితే ఆయనకు రాజకీయంగా ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. ఆయన సాధారణ ఎంపీగానే కొనసాగాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ విజయసాయరెడ్డి, మిధున్ రెడ్డి వంటి నేతల డామినేషన్ ఉంటుంది. వారిని కాదని తనకు భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించిన రఘురామ కృష్ణంరాజు వైసీపీపై కాలు దువ్వుతున్నారంటున్నారు.
అందుకోసమే రఘురామ కృష్ణంరాజు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ కు గురైతే నేరుగా బీజేపీ కండువా కప్పేసుకోవచ్చన్నది రఘురామ కృష్ణంరాజు ఆలోచనగా ఉంది. అందుకే నిన్న మొన్నటి వరకూ వైసీపీ సర్కార్ పై విమర్శలు చేసి, జగన్ ను ప్రశంసించిన రఘురామ కృష్ణంరాజు నేడు జగన్ పై నేరుగా విమర్శలు చేస్తున్నారు. తాను జగన్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి గెలవలేదని కూడా రఘురామ కృష్ణంరాజు అన్నారంటే ఆయన పార్టీ నుంచి వైదొలగేందుకే నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో రఘురామ కృష్ణంరాజును కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్టు ఆయనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పెషల్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.రఘురామకృష్ణంరాజు బీజేపీ చేతిలో పావుగా మారారా ?ఆయనంతట ఆయనే జగన్ పై కాలు దువ్వుతున్నారాఅన్నది తేలాల్సి ఉంది.మొత్తం మీద నర్సాపురం ఎంపి వ్యవహార శైలి వైసిపికి ఇబ్బందికరంగానే ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.