Breaking: తీవ్ర ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దేశంలో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.ఇటీవల పెరిగిన ధరలు, నిత్యవసరాల కొరత, విద్యుత్ కోతలతో గత కొన్నిరోజులుగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అధ్యక్ష నివాసంపై ప్రజలు దండెత్తిన నేపథ్యంలో అధ్యక్షుడు గోటబయా రాజపక్స దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆందోళనలు అణిచివేసేందుకు సైన్యానికి సర్వాధికారాలు ఇచ్చారు. అయినప్పటికీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో కర్ఫ్యుూ అమలు చేస్తున్నారు.
ఈ తరుణంలో 26 మంది కేబినెట్ మంత్రులందరూ మంత్రివర్గానికి రాజీనామా చేశారు. అనంతరం శ్రీలంక ప్రధానికి రాజీనామా పత్రాలు అందజేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే ప్రధానిగా మహిందా రాజపక్సా కొనసాగనున్నారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన సమావేశంలో మూకుమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలుత ప్రధాని మహిందా రాజపక్సా రాజీనామా చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను ప్రధాన మంత్రి కార్యాలయం ఖండించింది.